ALERT : 9 అంకెల నెంబర్ ఫోన్ కాల్స్‌తో సైబర్ మోసాలు

by Disha Web Desk 4 |
ALERT : 9 అంకెల నెంబర్ ఫోన్ కాల్స్‌తో సైబర్ మోసాలు
X

దిశ, రాచకొండ : +91తో కలిపి 9 అంకెల నెంబర్‌తో మీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయా అయితే బిగ్ అలర్ట్. ఆ ఫోన్ కాల్స్ సమాధానం ఇస్తే ఇంకేముంది మీ ఖాతాలు ఖాళీ కావడం ఖాయం. కేవలం మహిళలను కలవర పెట్టి, భయం సృష్టించి సైబర్ మోసగాళ్లు లక్షలాది రూపాయలను కొల్లగొడుతున్నారు. హైదరాబాద్ నగరంలో నమోదైన 30 ఫిర్యాదులు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

నేరాలు ఇలా..

సైబర్ మోసగాళ్లు తాజాగా voip( వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్) ద్వారా +91తో కలిపి 9 అంకెల నెంబర్‌ల‌తో ఫోన్ చేస్తున్నారు. ఈ ఫోన్ ఎత్తగానే మేము ముంబై సీబీఐ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము. మీ ఆధార్ నెంబర్, మీ పేరు ఇదేనా అని అడుగుతారు. మీరు ముంబై నుంచి తైవాన్‌కు ఫెడ్ఎక్స్ కొరియర్ ద్వారా పార్సెల్ పంపిస్తున్నారని అందులో డ్రగ్స్ ఉన్నాయని భయపెడతారు.

ఇంకా అనుమానస్పద పత్రాలు ఇతర దేశాలకు పంపిస్తున్నారని, మీరు మని లాండరింగ్‌కు పాల్పడుతున్నారని కొరియర్ ప్రతినిధి చెబుతాడు. మీ మీద ముంబై సీబీఐ కేసు నమోదు చేసుకుందని.. ఈ సమాచారాన్ని మీ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చామని అంటారు. వారు 20 నిమిషాల్లో మిమ్మల్ని అరెస్టు చేసి మాకు అప్పగిస్తారని వివరిస్తారు. ఈ మాటలకు భయపడి మా తప్పు లేదు మమ్మల్ని రక్షిచండి అని ప్రాధేయపడగానే లూటీ మొదలు పెడతారు. స్క్రీన్ షేరింగ్ యాప్స్‌తో..

మీరు నిర్దోషి అని తెలియాలంటే మీ బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయాలి.. మీకు మొత్తం ఎన్ని ఖాతాలు ఉన్నాయి చెప్పండి అని బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తారు. స్క్రీన్ షేరింగ్ యాప్స్‌ల ను డౌన్లోడ్ చేయిస్తారు. దీంతో మీ ఫోన్ మొత్తం వారి కంట్రోల్‌లో‌కి వెళ్ళిపోతుంది. వెంటనే మీ ఖాతా నుంచి మా సీబీఐ ఖాతాకు కొంత డబ్బు పంపమని చెబుతారు.

ఈ సమయంలో సైబర్ మోసగాళ్లు స్క్రీన్ షేరింగ్ యాప్స్ ద్వారా మీ బ్యాంకు ఖాతా నెంబర్, పాస్ వర్డ్, యూజర్ నేమ్, పిన్ నెంబర్‌లను తెలుసుకుంటారు. దాదాపు అలా 3 గంటల పాటు మాటల్లో పెట్టి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తారు. ఇలా హైదరాబాద్ నగరంలో ఈ విధమైన మోసానికి గురైన వారి సంఖ్య 30 వరకు చేరింది. ఇందులో 23 మంది మహిళలు బాధితులుగా పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు. అత్యధికంగా ఓ మహిళ ఇలాంటి మోసానికి గురై రూ.40 లక్షలు పోగుట్టుకుంది. మొత్తం సైబర్ నేరగాళ్ళు రూ.కోటిన్నర కాజేసారని నమోదైన ఫిర్యాదులతో వెల్లడి అయింది.

ఈ మోసానికి గురి కావొద్దంటే..

మనకు వచ్చే ఫోన్ కాల్స్ +91తో కలిపి 10 అంకెలు ఉంటాయని గ్రహించాలి. ముంబై టూ తైవాన్ ఫెడ్‌ఎక్స్ కొరియర్ పేరు చెప్పగానే సైబర్ మోసానికి సంబంధించిన కాల్ గా అనుమానించాలి. సీబీఐ పేరు చెప్పి పోలీసులు వస్తున్నారని మాట్లాడితే సరే పోలీసులు వచ్చిన తర్వాత మాట్లాడుతామని ఫోన్ కట్ చేయాలి. స్క్రీన్ షేరింగ్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోమంటే అసలు చేయొద్దు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్‌లకు రెస్పాండ్ అవొద్దు.

గుర్తు తెలియని వ్యక్తులు సుదీర్గంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే అది సైబర్ మోసగాళ్ల ఫోన్ కాల్‌గా భావించాలి. ఈ 9 అంకెల ఫోన్ కాల్స్ voip ద్వారా వస్తుందడంతో వీటి ఐపీ అడ్రస్‌లు విదేశాలలో ఉంటున్నాయి. కొట్టేసిన నగదు కూడా వర్చువల్ కరెన్సీ రూపంలో విదేశాలకు పంపిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ నయా మోసం నుంచి అప్రమత్తంగా ఉండాలని సిటీ పోలీసులు సూచిస్తున్నారు. డార్క్ వెబ్ ద్వారా సైబర్ క్రిమినల్స్ పలు కొరియర్ సంస్థల నుంచి డాటా కొట్టేసారని పోలీసులు అనుమానిస్తున్నారు.


Next Story