ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ.. ప్రభుత్వం రిక్వెస్ట్‌కు గ్రీన్ సిగ్నల్

by Disha Web Desk 4 |
ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ.. ప్రభుత్వం రిక్వెస్ట్‌కు గ్రీన్ సిగ్నల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభ ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. ప్రభుత్వ అభ్యర్థనను అంగీకరించిన అక్బరుద్దీన్ ఓవైసీ.. రేపు ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సభలో సీనియర్లుగా ఉన్న ఎమ్మెల్యేలలో ఒకరిని ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఎన్నికైన సభ్యుల్లో మాజీ సీఎం కేసీఆర్ సభలో అందరి కంటే సీనియర్. కానీ, ఆయన ఆసుపత్రిలో చేరడంతో రేపటి అసెంబ్లీ సమావేశానికి దూరంగానే ఉండనున్నారు.

ఆ తరువాత మాజీ స్పీకర్ పోచారం, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో పాటు మరికొందరు సీనియర్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అక్బరుద్దీన్ ఓవైసీకీ ప్రభుత్వం ప్రొటెమ్ స్పీకర్‌గా అవకాశం కల్పించింది. దీంతో ఓవైసీ తొలుత రాజ్ భవన్‌లో గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సభలో కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను ఎన్నుకుంటారు. కాగా గత ఎన్నికల్లో ఎంఐఎం, బీఆర్ఎస్‌కు మిత్రపక్షంగా కలిసి నడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం అక్బరుద్దీన్‌కు అవకాశం కల్పించడం ఆసక్తిగా మారింది. కాగా 2018లోనూ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎంకే అవకాశం దక్కింది. అప్పుడు చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ప్రొటెమ్ స్పీకర్‌గా కేసీఆర్ నియమించారు.


Next Story