కేసీఆర్.. విద్యారంగంపై సమీక్ష నిర్వహించే టైం లేదా..? AISF ఆగ్రహం

by Disha Web Desk 19 |
కేసీఆర్.. విద్యారంగంపై సమీక్ష నిర్వహించే టైం లేదా..? AISF ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా విద్యారంగం పట్ల ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యారంగంపై సమీక్ష చేసే కనీస సమయం లేదా అని? ఏఐఎస్ఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు సమస్యలకు నిలయంగా మారాయని ఆరోపించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం హామీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులకు సొంత భవనాలు కనీస మౌలిక వసతులు లేవని, మెస్ ఛార్జీలు పెంపు లేదని, యూనివర్సిటీ విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారనీ పేర్కొన్నారు. యూనివర్సిటీల అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించకుండా ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వ యూనివర్సిటీలను రాష్ట్రంలో నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని తెలిపారు.

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని తెలిపారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్య బీటెక్ చదువుల కంటే ఎల్‌కేజీ, యూకేజీ చదువుల ఫీజులే ఎక్కువగా ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలు, యూనివర్సిటీలు పూర్తిగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులవన్నారు. మరో నెల రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి విద్యారంగంపై సమీక్ష నిర్వహించి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను ఏకం చేసి మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహిస్తామని మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ హెచ్చరించారు.



Next Story

Most Viewed