రైతుల‌ కోసమే అగ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్: బాల భాస్కర్

by Disha Web Desk 11 |
రైతుల‌ కోసమే అగ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్: బాల భాస్కర్
X

దిశ‌, దేవ‌రుప్పుల‌ (పాల‌కుర్తి): రైతులకు న్యాయ సేవలు అందించడానికి దేశంలోనే తొలిసారిగా అగ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్ ను పాలకుర్తి మండలంలోని ప్రఖ్యాత కవి పోతన స్వగ్రామం బమ్మెరలో ప్రారంభించిన‌ట్లు జిల్లా జడ్జి న్యాయ సేవల అథారిటీ చైర్మన్ బాలభాస్కర్ తెలిపారు. రాష్ట్ర తెలంగాణ న్యాయ సేవల అథారిటీ, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) కలిసి అగ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్ శనివారం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణ్యన్ వర్చువల్ మోడ్ లో ఈ క్లినిక్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బాల భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దుక్కి దున్నే నాటి నుంచి పండించిన పంటను మార్కెట్ లో అమ్మేదాకా రైతులు ఎదుర్కొనే భూమి సమస్యలు ఉత్పన్నమైనపుడు, నాణ్యతలేని విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల వల్ల నష్టం, మార్కెట్ మోసాలు, పంటల బీమా, అతివృష్టి, అనావృష్టి ఇలా పలు సందర్భాలలో చట్టంతో రైతులకు అవసరం ఏర్పడుతుంద‌న్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులను ఆశ్రయించాల్సి వచ్చినప్పుడు, కోర్టులకు వెళ్లాల్సి వచ్చినపుడు న్యాయ సేవలను పొందడం అవసరం అవతుందన్నారు. కానీ చట్టాలపై అవగాహన లేక, న్యాయ సహాయం అందక రైతులు వారికి మేలు చేసే చట్టలున్నా లబ్ది పొందలేక పోతున్నార‌న్నారు.

రైతులకు ప్రతి విషయంలో న్యాయ చట్టాలను ఉపయోగించి ప్రయోజనం చేకూర్చేందుకు అగ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉపయోగపడుతుందని, రైతులు గ్రామపంచాయతీ కార్యాలయంలో భూ సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రతినిధి ఉంటారని వారికి మీ సమస్యను వివరిస్తే సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపుతారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో లీఫ్స్ సంస్థ అధ్యక్షుడు భూమి సునీల్, జిల్లా న్యాయ సేవల అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఆంజనేయులు, జూనియర్ ప్రిత్వి రాజ్, నల్సార్ రిజిస్ట్రార్ విద్యులతా రెడ్డి, లీఫ్స్ సంస్థ సలహాదారు కరుణాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed