రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి గడ్డం వివేకానంద

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-10-12 09:05:26  IST  )

దిశ‌, మంచిర్యాల : రైతుల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయ‌మని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్బ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. ఆదివారం జిల్లాలోని

రైతుల సంక్షేమమే  ప్రభుత్వ ధ్యేయం : మంత్రి గడ్డం వివేకానంద
X

దిశ‌, మంచిర్యాల : రైతుల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయ‌మని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్బ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. ఆదివారం జిల్లాలోని చెన్నూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో కోటపల్లి మండలం బబ్బెర చెలక, దేవులవాడ గ్రామాల రైతులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వివేకానంద మాట్లాడారు. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ లో భూములు కోల్పోయిన బాధితులంద‌రికీ ప‌రిహారం అందించేవిధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. చ‌ట్ట ప్ర‌కారం.. అర్హులైన బాధితుల‌కు ప‌రిహారం అందిస్తామ‌ని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు రూ. 36 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని రూ. 11 వేల కోట్ల వరకు పూర్తి చేశార‌ని.. మిగిలిన రూ.25 వేల కోట్ల పనులు పూర్తి చేసినట్లయితే ఈ ప్రాంతంలో 55 వేల ఎకరాల ఆయకట్టు భూమిలో రైతులు అధిక దిగుబడితో పంట సాగు చేసేవారన్నారు. భూములు కోల్పోయే పరిస్థితి ఉండేది కాదన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా బ్యాక్ వాటర్ తో పంట పొలాలు, కొన్ని నివాస ప్రాంతాలు ముంపున‌కు గురై ప్రజలు ఎంతో నష్టపోయారని తెలిపారు.

ముంపు బాధితులకు పూర్తి స్థాయిలో నష్ట పరిహారం చెల్లించలేదని, ఈ చర్యతో పాటు గత ప్రభుత్వ లోటు పాట్లను సరి చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ముంపు బాధితుల సంక్షేమంలో భాగంగా ఇప్పటి వరకు రూ.10 కోట్లను కేటాయించి అర్హులైన వారికి అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భూ సేకరణ ప్రక్రియ నిర్వహించి ప్రభుత్వం కేటాయించిన ప్రకారం లబ్ధిదారులకు పరిహారం అందిస్తామ‌ని తెలిపారు. ముందుగా అసలైన పట్టేదారు రైతులకు ప్రాధాన్యత ఉంటుంద‌ని.. ఆ త‌రువాత‌ అర్హులైన మిగతా వారికి సైతం పరిహారం అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 రాయితీ గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, రైతు బీమా వంటి అనేక ప్రజా ప్రయోజనకర పథకాలను అమలు చేయడంతో పాటు మహిళల ఆర్థిక అభివృద్ధికి చేయూతనిస్తూ స్వయం సహాయక సంఘాలకు రుణ సదుపాయం కల్పించి వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.

అర్హులైన ముంపు బాధితుల‌కు ప‌రిహారం

అర్హులైన ముంపు బాధితులంద‌రికీ ప‌రిహారం అందించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని క‌లెక్ట‌ర్ కుమార్ దీప్ తెలిపారు. తొలుత ఎలాంటి వివాదాలు లేని భూములకు అవార్డు ఉంటుంద‌ని.. డిసెంబ‌ర్ 18, 19 తేదీల్లో అర్హులైన వారికి అందించ‌డంతో పాటు భూ సంబంధిత వివాదాల్లో రాజీ అయిన వారికి నిబంధ‌న‌ల ప్ర‌కారం.. చెల్లింపులు ఉంటాయ‌ని తెలిపారు. లేదంటే సంబంధించిన అవార్డు మొత్తం కోర్టులో జ‌మ‌చేయ‌నున్న‌ట్టు తెలిపారు. రూ.33 కోట్ల‌లో రూ.5కోట్లు మంజూరు అయ్యాయ‌ని, మ‌రో 5 కోట్ల పీడీ ఖాతాల్లో ఉన్నాయ‌ని తెలిపారు. బాధితులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మంచిర్యాల రాజస్వ మండలాధికారి శ్రీనివాసరావు, కోటపల్లి మండల త‌హ‌శీల్దార్ రాఘవేంద్ర, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story