భారీ వర్షానికి ప్రభుత్వ ఆసుపత్రిలో విలువైన పరికరాలు ధ్వంసం

by Disha Web Desk 12 |
భారీ వర్షానికి ప్రభుత్వ ఆసుపత్రిలో విలువైన పరికరాలు ధ్వంసం
X

దిశ, లక్షెట్టిపేట: ఆసుపత్రి భవనంపై పైకప్పు రేకులు వేయించడంలో చేసిన జాప్యంతో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి విలువైన సామాగ్రి, మందులకు నష్టం వాటిల్లిన ఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే.. లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి నూతన భవన మంజూరు కావడంతో గత జనవరి నెలలో ఆసుపత్రిని స్థానిక పాత ఎంపీడీవో ఆఫీస్ భవనంలోకి షిఫ్ట్ చేశారు. సంబంధిత కాంట్రాక్టర్లు ఆస్పత్రిలోని ఇన్ పేషంట్ల వార్డు భవనానికి పై కప్పు సిమెంట్ రేకులను తొలగించి కొత్త అల్యూమినియం రేకులు వేయాల్సి ఉంది. కొత్త రేకులను వేయించడంలో తాత్సార్యం చేస్తూ వస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు శిథిలమైన సిమెంట్ రేకుల నుంచి పేషంట్ల వార్డు కురుస్తోంది.

ఈ విషయమై ఆసుపత్రి వైద్యులు తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత కాంట్రాక్టర్లు ఐదు రోజుల కిందట పాత రేకులను తొలగించే పనులు ప్రారంభించారు. రెండు రోజుల్లోగా కొత్త పై కప్పు రేకులు వేసి పనులు పూర్తి చేస్తామని జాప్యం చేయడంతో వర్షానికి భారీ నష్టం వాటిల్లింది. ఆస్పత్రిలోని విద్యుత్ సరఫరా లైన్, ఇన్వర్టర్, వ్యాక్సిన్లు నిల్వ చేసే ఫ్రిజ్, ఏసీ వర్షపు నీటికి తడిచిపోయి ధ్వంసమయ్యాయి. రికార్డులు, మందులు తడిసిపోయాయి. సుమారు రూ 25 లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, పాత ఎంపీడీవో ఆఫీస్ భవనానికి పూర్తి స్థాయి రిపేర్లు కాకుండానే ఆసుపత్రిని షిఫ్ట్ చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది.


Next Story

Most Viewed