తప్పిపోయిన బాలుని ఆచూకీ లభ్యం

by Disha Web Desk 20 |
తప్పిపోయిన బాలుని ఆచూకీ లభ్యం
X

దిశ, లోకేశ్వరం : బోధన్ పట్టణంలోని పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుండి మంగళవారం ఉదయం వెళ్లి అదృష్యం అయిన బాలుని ఆచూకీ లభ్యం అయింది. లోకేశ్వరం మండలంలోని పొట్ పెళ్లి (బి) గ్రామానికి చెందిన సుంకం జస్వంత్ అనే విద్యార్థి బోధన్ పట్టణంలోని ఇందూర్ మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. కాగా దసరా సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చిన విద్యార్థి మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్లాడు. కానీ ఆరోజు సాయంత్రం వరకు పాఠశాలకు చేరకపోవడంతో అక్కడి ఉపాధ్యాయులు విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు లోకేశ్వరం, బైంసా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా భైంసాలో నిజామాబాద్ బస్సు ఎక్కినట్లు గుర్తించారు.

బుధవారం రాత్రి ఆ బాలుడు తన స్నేహితునికి చరవాణి ద్వారా తాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నట్లు సమాచారం ఇచ్చాడు. వెంటనే అతని స్నేహితుడు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు సమాచారం చేరవేశారు. భైంసా పోలీసులు వెంటనే సికింద్రాబాద్ లోని రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు స్టేషన్లో గాలించి విద్యార్థి ఆచూకీ కనుగొన్నారు. అదే రోజు రాత్రి లోకేశ్వరం బైంసా పోలీసులతోపాటు విద్యార్థి కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ కు వెళ్లి విద్యార్థిని బైంసా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పచెప్పినట్లు సమాచారం.



Next Story

Most Viewed