ప్రజలకు అత్యంత అందుబాటులో ఆకాశవాణి సేవలు : MP Soyam Bapu Rao

by Disha Web Desk 1 |
ప్రజలకు అత్యంత అందుబాటులో ఆకాశవాణి సేవలు : MP Soyam Bapu Rao
X

దిశ, కాగజ్ నగర్: ప్రజలకు అత్యంత అందుబాటులోకి ఆకాశవాణి (ఎఫ్ఎం) సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించడం గొప్ప విషయమని ఎంపీ సోయం బాపురావు అన్నారు. శుక్రవారం కాగజ్ నగర్ పట్టణ కేంద్రంలోని రైల్వేస్టేషన్ రోడ్ లో గల తైభానగర్ లో ఆకాశవాణి (ఎఫ్ఎం) కేంద్రాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆన్ లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ సోయం బాపురావు పాల్గొని వీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో 91 (ఎఫ్ఎమ్) రేడియో కేంద్రాల ఏర్పాటుతో ప్రసార వాణి ద్వారా ప్రజలకు అనేక విషయాలు తెలిసే అవకాశం ఉంటుందన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో మంత్రి అనురాగ్ ఠాగూర్ గారిని కలిసి ప్రసారవాణి ఏర్పాటుకు కృషి చేయాలని విన్నవించగా స్పందించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు చోట్ల ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రాలను ప్రారంభించినందుకు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో కొమురం భీం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

రైతు వ్యతిరేక ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అని, సొంత పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారంటూ సీఎం కేసీఆర్ కూడా ఒప్పుకున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రం అవినీతి అక్రమాల ఊబిలో చిక్కుకుందని, ఓ పక్క వడగళ్ల వానతో పంటలు నష్టపోయి రైతులు ఆందోళన చెందుతుంటే మరోవైపు సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఎంపీ జన్మదినం సందర్భంగా సిర్పూర్ టీ మండలంలోని టోంకిని హనుమాన్ ఆలయంలో దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చాహత్ వాజ్పాయ్, సిర్పూర్ భాజపా నాయకుడు పాల్వాయి హరీష్ బాబు, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story