అటవీ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

by Muthe.Rajitha |   (  Updated:2025-07-13 15:22:30  IST  )

అటవీ శాఖ అధికారులపై బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) సీరియ‌స్ అయ్యారు.

అటవీ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్ : అటవీ శాఖ అధికారులపై బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) సీరియ‌స్ అయ్యారు. బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లిలో వనమహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే... పోడు రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని మండిపడ్డారు. అయితే అంతకముందు బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట నెన్నెల రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప‌ట్టాలు ఉన్నా ఫారెస్ట్ అధికారులు భూములు సాగు చేయనివ్వడం లేదని రైతులు నిరసన చేస్తూ.. పురుగుల మందు తాగే ప్ర‌య‌త్నం చేయ‌గా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఎమ్మెల్యే అట‌వీ అధికారుల‌పై మండిప‌డ్డారు. రైతులను ఇబ్బంది పెడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం సరికాద‌న్నారు. నియోజకవర్గంలో పొడు రైతులను ఇబ్బంది పెట్టడం వద్దని హెచ్చ‌రించారు. చెన్నూర్ నియోజకవర్గంలో ఫారెస్ట్ అధికారులు ఒక రూల్ పెట్టి బెల్లంపల్లి నియోజకవర్గం లో మరొక‌ రూల్ పెట్టడం ఏంటని ఆయ‌న ప్ర‌శ్నించారు. దీనిపై సంబంధిత మంత్రి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

ఏమైనా సమస్యలు ఉంటే అటవీ అధికారులు తమ దృష్టికి తీసుకురావాలని రైతులను ఇబ్బందికి గురి చేస్తే సహించబోమని ఎమ్మెల్యే వినోద్ స్ప‌ష్టం చేశారు. పోడు భూముల సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిర‌క్షిస్తామ‌న్నారు. అంతేగాని అటవీ అధికారులు నేరుగా వెళ్లి రైతుల పంటలను ధ్వంసం చేయవద్దని ఆదేశించారు. ఇకముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు.

Next Story