నేను చేసిన అభివృద్ధి ఏమిటో చూపిస్తా.. నీ అక్రమాలు నిరూపిస్తా..!

by Disha Web Desk 11 |
నేను చేసిన అభివృద్ధి ఏమిటో చూపిస్తా.. నీ అక్రమాలు నిరూపిస్తా..!
X

దిశ, మంచిర్యాల: నియోజకవర్గానికి నేను చేసిన అభివృద్ధి ఏమిటో చూపిస్తా.. నీవు చేసిన అక్రమాలు ఏమిటో నిరూపిస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావును ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం మంచిర్యాలలో మీడియాతో మాట్లాడుతూ..హైదరాబాద్ లో పత్తాలాట క్లబ్ నడిపిన చరిత్రతో పాటు భూ కబ్జాలు, బ్యాంకుల అప్పులు ఎగ్గొట్టే మాజీ ఎమ్మెల్సీకి తాను చేసిన అభివృద్ధి ఎలా కనబడుతుందని ఎద్దేవా చేశారు.

మంచిర్యాలకు మెడికల్ కళాశాల తో పాటు గూడెం లిఫ్ట్ ద్వారా లక్షెట్టిపేట, దండేపల్లి, హాజిపూర్, మండలాల్లో సాగునీటి ఇబ్బందులు లేకుండా తాను చేశానని గుర్తు చేశారు. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న నీవు మంచిర్యాల నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని సవాల్ విసిరారు. నాలుగు నీతి మాటలు చెబుతూ ఉత్తర కుమార ప్రగల్బాలు పలికితే ఎవరూ నిన్ను నమ్మే పరిస్థితి లేదన్నారు.

మంచిర్యాల జిల్లా వద్దని బెల్లంపల్లిలో జిల్లా కేంద్రం కావాలని చెప్పిన మాజీ ఎమ్మెల్సీకి ఈ నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు లేదన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఇక్కడ ఖర్చు చేసినంత మాత్రాన నియోజకవర్గ ప్రజలు నిన్ను ఆదరిస్తారని అనుకోవడం మూర్ఖత్వమని మండిపడ్డారు. మోసం చేసి సంపాదించిన డబ్బులతోనే చీరలు పంచుతున్నాడని ఆరోపించారు. సొంత పార్టీ నాయకుల వద్దనే కోట్ల రూపాయలు వసూలు చేసి వారికి ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి తనపై అసత్య ప్రచార చేయడం సిగ్గుచేటన్నారు.

సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలసీలతోనే నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగుర బోతుందని జోస్యం చెప్పారు. మంచి మంచిర్యాల ఏర్పాటు కు తాను కట్టుబడి ఉన్నానని, ఆ దిశగా పని చేస్తున్నానని చెప్పారు. అహంకారం, అహంభావానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న నీవు న్యాయం, ధర్మానికి కట్టుబడి ప్రజాక్షేత్రంలో పని చేస్తున్న తనను ఏమీ చేయలేవన్నారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, లక్షెట్టిపేట, నస్పూర్ మున్సిపల్ చైర్మన్లు నల్మాస్ కాంతయ్య, ఈసంపల్లి ప్రభాకర్, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్మోట పలుకుల గురువయ్య, హాజీపూర్ ఎంపీపీ మందపల్లి స్వర్ణలత, నాయకులు బేర సత్యనారాయణ, పోడేటి శ్రీనివాస్ గౌడ్, గాదె సత్యం తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed