డబుల్ దళారీలు.. ఇండ్లు ఇప్పిస్తామని డబ్బుల వసూలు

by Dishanational2 |
డబుల్ దళారీలు.. ఇండ్లు ఇప్పిస్తామని డబ్బుల వసూలు
X

దిశ, ప్రతినిధి నిర్మల్ : డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ వ్యవహారం ఒక ప్రహసనంలా మారిపోతున్నది. అర్బన్ ప్రాంతాల్లో జి ప్లస్ వన్ పద్ధతిన ఇళ్ల నిర్మాణం చేపట్టగా గ్రామీణ ప్రాంతాల్లో ఇండిపెండెంట్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించారు. ప్రభుత్వం మంజూరు చేసిన స్థాయిలో ఇళ్ల నిర్మాణాలను చేపట్టలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఆర్థికంగా ప్రభుత్వానికి తీవ్రమైన భారంగా మారడంతో చాలాచోట్ల ఇంకా ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతూనే ఉన్నది. నిర్మల్ జిల్లాలో 6686 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా ఇప్పటిదాకా 3200 ఇండ్లు మాత్రమే నిర్మాణం పూర్తయ్యాయి. మిగతా ఇండ్ల నిర్మాణం ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. అయితే పూర్తయిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు మంజూరు చేయడం అధికార యంత్రాంగానికి కత్తి మీద సాములా తయారవుతున్నది.

లబ్ధిదారుల ఎంపికపై తీవ్ర అనుమానాలు


డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై తీవ్రస్థాయిలో అనుమానాలు ఉన్నాయి. పూర్తయిన ఇళ్లను పంపిణీ చేసే విషయంలో లాటరీ పద్ధతి అవలంబించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మున్సిపల్ పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన ఇళ్ల ఎంపికలకు ఆయా జిల్లాల కలెక్టర్లు తేదీలు ఖరారు చేసి లబ్ధిదారుల పేర్లను లాటరీ విధానంలో ఎంపిక చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు అయితే ఎక్కువగా అధికార పార్టీ కార్యకర్తలకు ఇండ్ల మంజూరు జరుగుతున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఈ విషయంలో అధికార పార్టీ నేతలు లబ్ధిదారులను గుర్తించి లాటరీ పద్ధతిలో పొందిన వారి వద్ద కూడా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి నిర్మల్ జిల్లాలో 445 ఇండ్లను ఇప్పటికే లబ్ధిదారులకు ఇవ్వగా వారంతా గృహప్రవేశాలు చేసుకున్నారు మిగతా నిర్మాణాలు పూర్తయిన ఇండ్లకు సంబంధించి ఇంకా కొన్ని మౌలిక వసతులు పూర్తికాని కారణంగా గృహప్రవేశాలు జరగలేదు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే దశలో ఉండగానే ఆయా నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక చేశారు నిర్మల్ జిల్లా కేంద్రంలో సుమారు 1700 పైగా ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరగక ఖానాపూర్ నియోజకవర్గంలో 400 ముధోల్ నియోజకవర్గం లో 600 పైగా డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశారు.

దళారీల రంగ ప్రవేశం..


డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తామని అధికార పార్టీకి చెందిన అనేకమంది దళారీలు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఆరోపణలు ఉన్నాయి పట్టణ ప్రాంతాల్లో కౌన్సిలర్లు అధికార పార్టీ ముఖ్య నేతలు గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ మొదలుకొని ఎంపీపీ జడ్పిటిసి ల దాకా లబ్ధిదారుల వద్ద డబ్బులు వసూలు చేసిన ఆరోపణలు ఉన్నాయి ముధోల్ నియోజకవర్గంలోని తానూర్ కుబీర్ బాసర ముధోల్ మండలాల్లో లబ్ధిదారుల నుంచి డబ్బుల వసూళ్లు ఎక్కువగా జరిగినా ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో లబ్ధిదారు నుంచి లక్ష నుంచి రెండు లక్షల దాకా వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో కుబీర్ మండలంలో కొందరు లబ్ధిదారులు ఎమ్మెల్యే విట్టల్ రెడ్డిని నేరుగా నిలదీసిన ఘటన కూడా చోటుచేసుకుంది ఖానాపూర్ నియోజకవర్గం లో ఇండ్ల పంపిణీ పూర్తిగా అక్రమంగా జరిగిందని ఆరోపిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో పట్టణ బంద్ జరిగిన ఘటన ప్రభుత్వం దాకా వెళ్ళింది చివరకు ఎమ్మెల్యే రేఖా నాయక్ కలగజేసుకొని లబ్ధిదారుల ఎంపిక విషయంలో మరోసారి అర్హులను గుర్తిస్తామని హామీ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది నిర్మల్ అర్బన్ లో కొందరు అధికార పార్టీ నేతలు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేయగా లాటరీ పద్ధతిలో వారికి ఇండ్లు రాలేకపోవడంతో వ్యవహారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దాకా వెళ్ళింది. కొందరు కౌన్సిలర్లు పార్టీ కార్యకర్తలను మంత్రి ఈ విషయంలో తీవ్రంగానే మందలించినట్లు పార్టీలో ప్రచారం ఉంది అయితే లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ డబుల్ బెడ్ రూమ్ మంజూరు కాకపోవడంతో ఆశపడి నేతలకు ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోతుండడంతో వారి ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. దీని ప్రభావం వచ్చే ఎన్నికలపై చూపుతుందని అధికార పార్టీ శాసనసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Next Story