ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం: సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్

by Kema Shiva Kumar |

ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని భారత కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్ అన్నారు.

ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం: సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్
X

దిశ, భీమిని: ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని భారత కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ప్రజాపోరు యాత్రలో భాగంగా నాలుగో రోజు భీమిని మండలం లోని రాంపూర్లో సీపీఐ సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య ప్రజా పోరుయాత్రను ప్రారంభించారు. బిట్టురుపల్లి మీదుగా మండల కేంద్రానికి ఎర్రజెండాల పట్టుకొని డప్పు చప్పుల నడుమ కళాకారుల నృత్యాలతో పాటలు పాడుకుంటూ గ్రామాల్లో అందరిని ఆకట్టుకున్నారు.

ఉదయం 8 గంటలకే ప్రజా పోరుయాత్ర ప్రారంభించి, ఇంటింటికి తిరుగుతూ గ్రామంలో సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఐ ఆధ్వర్యంలో దశల వారీగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని అన్నారు. మండలంలో కొందరు అధికార పార్టీ నాయకులు గుండా గిరి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను సైతం కబ్జా చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. నిరుపేదలకు పంపిణీ చేసే భూములను దగాకోరులు పాగ వేస్తున్నారని మండిపడ్డారు. ఎందరో అమరుల ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కష్టాలు పోలేదన్నారు.

ఆత్మ బలిదానాలు చేసుకున్న అమర వీరులు కన్న బంగారు తెలంగాణ ఆకాంక్షను తీర్చే విధంగా సీపీఐ పోరాటాలు ఉంటాయని అన్నారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందిస్తున్నా ఐకేపీ వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగాలుగా గుర్తించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి సభ్యులు కలవేని శంకర్, ప్రజాపోరు యాత్ర సభ్యులు దాగం మల్లేష్, గుండా చంద్ర మాణిక్యం, సంతోష్, ఉపేందర్, కామెర దుర్గ, రాజు, పురుషోత్తం, బాపు, ప్రజానాట్య కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story