చేపల కోసం వాగులో కరెంటు .. చివరికి ఏమైందో తెలుసా..

by Disha Web Desk 20 |
చేపల కోసం వాగులో కరెంటు .. చివరికి ఏమైందో తెలుసా..
X

దిశ, లక్షెట్టిపేట : దొంగతనంగా చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి వాగులో వలనో, గాలాన్నో వేయకుండా ఏకంగా కరెంటును సరఫరా చేసి తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. వాగులో విద్యుత్ సరఫరా ఉన్న నీళ్ల వైపు చేపల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. ఈ ఘటన లక్షెట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జెండా వెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నాయక గూడకు చెందిన బద్ది అంజయ్య (45) అనే వ్యక్తి ఈ ఘటనలో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఆకుల సురేష్, తిరుమల శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి మృతుడు గ్రామ శివారులోని వాగుకి గురువారం చేపలు పట్టేందుకు వెళ్లారు.

వాగు వద్ద ఓ వ్యవసాయ మోటార్ కి ఉన్న స్టార్టర్ నుంచి దొంగతనంగా వాగులోకి కరెంటు వైర్లు వేసి విద్యుత్ సరఫరా చేశారు. నీళ్లలో విద్యుత్ షాక్ కి గురై పైకి తేలిన చేపలను పట్టేందుకు అంజయ్య వాగులోకి దిగాడు. కాగా, వాగు నీళ్లలో విద్యుత్ సరఫరా పరిధి అంచనా తెలియని అతడు విద్యుత్ సరఫరా ఉన్న నీళ్లవైపు వెళ్ళాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీళ్లలో విద్యుత్ షాక్ కి గురై మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఈ విషయం శుక్రవారం సాయంత్రం బయటికి పొక్కడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు లక్షెట్టిపేట ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.



Next Story

Most Viewed