బీఆర్ఎస్‌‌ను కవిత కడిగి పారేసింది: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

by Ajay Maddhiboyina |

బీఆర్ఎస్‌లో ముసలం తారాస్థాయికి చేరుకుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కవిత లేఖ పైన బీఆర్ఎస్ నాయకత్వం స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

బీఆర్ఎస్‌‌ను కవిత కడిగి పారేసింది: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌లో ముసలం తారాస్థాయికి చేరుకుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కవిత లేఖ పైన బీఆర్ఎస్ నాయకత్వం స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికే ఎంఎల్​సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖతో లుకలుకలు బయటపడ్డాయన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందని మేం చెబుతున్న మాటలను కవిత సమర్థించారని విప్ ఆది శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ తో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ సిద్దమతున్నారని కవిత చెప్పకనే చెప్పిందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పైన పల్లెత్తు మాట మాట్లాడకుండా కేసీఆర్ వ్యవహరించిన తీరును ఎంఎల్​సీ కవిత కడిగి పారేసిందన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయనే సంకేతాలు ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ బలహీనపడటం వల్లనే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నట్లు కవిత అంగీకరించారని ఆయన ఆరోపించారు.

కవిత పచ్చి నిజాలు మాట్లాడారని, ఆ మాటలనే మేం చాలా కాలంగా చెబుతున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నియంత్రుత్వ వైఖరీ ని కూడా కవిత నిలదీశారని అన్నారు. అంతే కాదు బీఆర్​ఎస్​పార్టీ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ ఒక్కరే ప్రసంగించడాన్ని ఆమె ప్రశ్నించారని తెలిపారు. బీఆర్​ఎస్​అధినేత కేసీఆర్ వైఖరీ ని ఆయన కూతురే తప్పుపడుతోందని ఇక ప్రజలకు వాళ్లేం సమాధానం చెబుతారన్నారు. కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితమయ్యారని కవిత తేల్చి చెప్పిందని, బీఆర్​ఎస్​పార్టీ నాయకులను కలవకుండా ఏకపక్ష పోకడలకు పోతున్నారని ఆమె ధ్వజమెత్తారన్నారు. మా సీఎం రేవంత్ రెడ్డి మీద ఒంటి కాలిపైన లేస్తున్న కేటీఆర్ ముందు తన చెల్లి కవిత కి సమాధానం చెప్పాలన్నారు.

కవిత కు సమాధానం చెప్పకుండా ఇతర పార్టీ లను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్ కు లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అలిగిన హరీష్ రావు ఇంటికి వెళ్లి కేటీఆర్ బతిమాలుకుంటున్నారని, కవిత లేఖతో బీఆర్ఎస్ పార్టీ ఇద్దరికి మాత్రమే పరిమితం అయిందని తేలిందన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన దోపిడి గురించి కూడా కవిత ప్రశ్నిస్తే బాగుంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పంపకాలు, పదవుల్లో తేడా వచ్చి కుటుంబంలో లేఖలు రాసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పని ఇక అయిపోయిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కేటీఆర్.. ముందు నీ ఇళ్లు సరిదిద్దుకో అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఫాం హౌస్ లోనే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడని , కేసీఆర్ తీరును ఆయన కూతురే తప్పుపడుతోందని అన్నారు. ప్రజలకు కేసీఆరే సమాధానం చెప్పాలని ఆది శ్రీనివాస్​స్పష్టం చేశారు.

Next Story