ఫైన్ ఆర్ట్స్ విద్యార్ధులపై వీసీ కక్ష సాధింపు

by Disha Web Desk 9 |
ఫైన్ ఆర్ట్స్ విద్యార్ధులపై వీసీ కక్ష సాధింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్ధులపై వీసీ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సూచించింది. విద్యార్థులు యూనివర్సిటీ లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని శాంతియుతమైన పద్ధతిలో నిరసన తెలియజేశారని, దీంతో విద్యార్థులకు నోటీసులు ఇచ్చి పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్న యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ చర్యలని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అర్ఎల్. మూర్తి, రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

విశ్వవిద్యాలయంలో ఎన్నో ఆశలతో వచ్చినటువంటి విద్యార్థులకు కనీస హాస్టల్ సౌకర్యం లేకుండా పేద గ్రామీణ విద్యార్థులు ప్రైవేట్ హాస్టల్లో ఉండాలంటే వేల రూపాయలు భరించాల్సి వస్తుందన్నారు. ఈ సమస్య పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ గత ఆరు నెలల క్రితమే వీసీ దృష్టికి తీసుకు పోయినప్పటికి ఇప్పటికి సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ విద్యార్థులపై కక్ష సాధింపు నిర్ణయం తీసుకుంటున్నదన్నారు. కనీసం క్యాంపస్‌లో తాగడానికి నీరు కూడా దొరికేటువంటి పరిస్థితుల్లో లేదని ఆరోపించారు.

క్యాంపస్ పరిసరాల్లో క్యాంటీన్ కూడా లేదని, సరైన కంప్యూటర్ ల్యాబ్ కూడా లేదని తెలిపారు. యూనివర్సిటీలో సమస్యల మీద నిరసన తెలియజేసే హక్కు లేకుండా వీసీ అడ్మినిస్ట్రేషన్ చర్యలు కనబడుతున్నాయని, విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారనే ఉద్దేశంతో అర్ధంతరంగా యూనివర్సిటీకి సెలవులు ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. సమస్యలు పరిష్కరించమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతూ నోటీస్‌లు ఇచ్చి విద్యార్దులను మాట్లాడకుండా గొంతు నొక్కలనే ధోరణి విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే విద్యార్థుల పక్షాన ఎస్ఎఫ్ఐ ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాదని హెచ్చరించారు.



Next Story

Most Viewed