- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాఠశాలల్లోనే విద్యార్థుల ఆధార్ నమోదు.. బయోమెట్రిక్ అప్డేషన్
తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్. ఇక నుంచి విద్యార్థుల ఆధార్, బయోమెట్రిక్ అప్డేట్ ఇక పాఠశాలల్లోనే చేయనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ వందశాతం ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్డేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల (JEE, NEET, IIT) సమయంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ ప్రత్యేక డ్రైవ్ను చేపట్టింది. బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరిగే పనిలేకుండా, పాఠశాల ప్రాంగణాల్లోనే ఆధార్ కిట్లను ఏర్పాటు చేసి నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఆధార్ మ్యాన్పవర్ ఏజెన్సీలను ప్రభుత్వం నియమించింది. ఒక్కో ఏజెన్సీకి 11 జిల్లాల బాధ్యతలను అప్పగించారు. ఇప్పటివరకు ఆధార్ లేని విద్యార్థులు లేదా బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్లో ఉన్న వారి వివరాలను యూడీఐఎస్ఈ పోర్టల్ ద్వారా గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులను (HMs) ఆదేశించారు. తమ పిల్లల ఆధార్ వివరాలు పెండింగ్లో ఉంటే వెంటనే పాఠశాల అధికారులను సంప్రదించాలని డైరెక్టర్ సూచించారు.
ఎందుకు ఈ నిర్ణయం..?
నీట్, జేఈఈ వంటి జాతీయ పరీక్షలకు హాజరయ్యే సమయంలో ఆధార్ బయోమెట్రిక్ వివరాలు సరిగ్గా లేకపోతే విద్యార్థులు వెరిఫికేషన్ ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ముందుగానే పాఠశాల స్థాయిలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.






