మాయమాటలు చెప్పి లోబర్చుకున్న యువకుడు.. ఇంటి ఎదుట మహిళ నిరసన

by Disha Web Desk 4 |
మాయమాటలు చెప్పి లోబర్చుకున్న యువకుడు.. ఇంటి ఎదుట మహిళ నిరసన
X

దిశ, వేలేరు: భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళను యువకుడు మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆమె వద్ద నుండి సూమారు రూ.15లక్షలు తీసుకుని ఇప్పుడు మోహం చాటేశాడు. దీంతో బాధిత మహిళ యువకుడి ఇంటి ముందు నిరసన చేపట్టిన ఘటన మండలంలోని ఎర్రబెల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. భాదిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా వేలేరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామానికి చెందిన ముత్తోజు అజయ్ అనే యువకుడు గత నాలుగు సంవత్సరాల క్రితం నుండి తనకు పరిచయమయ్యాడని తెలిపారు.

మాయ మాటలు చెప్పి తనను కొత్తకొండ దేవాలయంలో గత రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడని.. అప్పటి నుండి మేమిద్దరం కలిసే ఉంటున్నామని పేర్కొన్నారు. మాకు పెళ్లి జరిగిన తర్వాత నేను అజయ్ స్వగ్రామంలో రూ.15 లక్షలతో సొంతంగా ఇళ్లు నిర్మించుకున్నానని తెలిపారు. ఆయన తన చెల్లి పెళ్లి తర్వాత నన్ను ఇంటికి తీసుకువెళ్లి తనతో పాటు ఉంటానని నమ్మించాడన్నారు. ఇప్పుడు గత నాలుగైదు నెలలుగా తనతో కలిసి ఉండటం లేదని నేను గత 10రోజుల క్రితం ఎర్రబెల్లి గ్రామానికి వస్తే నన్ను అజయ్ కుటుంబ సభ్యులు తీవ్రంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం నేను ఎర్రబెల్లి గ్రామ సర్పంచ్ వద్దకు వెళ్లి తన సమస్య వివరించడంతో ఈనెల 19 న పెద్ద మనుషుల ఆధ్వర్యంలో పంచాయతీ నిర్వహించుకుంటామని ఇరువర్గాల వ్యక్తులం సర్పంచ్‌కు తెలిపామన్నారు. గత నాలుగైదు రోజులుగా అజయ్ సైదాపూర్‌లోని తన ఇంటి వద్దకు వచ్చి తనను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని తెలిపారు. దీంతో అజయ్ వేధింపులు భరించలేక నేను ఎర్రబెల్లి గ్రామంలో ఉన్న అజయ్ ఇంటికి వచ్చి ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న వేలేరు పోలీసులు గ్రామానికి చేరుకుని మహిళతో మాట్లాడి ఆమెకు న్యాయం చేస్తామని హమీ ఇచ్చి అక్కడి నుంచి ఆమెను పంపించి వేశారు.



Next Story

Most Viewed