నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించే ప్రయత్నం.. BRS ఎమ్మెల్యే పల్లాపై కేసు నమోదు

by Disha Web Desk 2 |
నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించే ప్రయత్నం.. BRS ఎమ్మెల్యే పల్లాపై కేసు నమోదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే (జనగాం) పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పీఎస్‌లో ఎఫ్ఐఆర్ (నెం.50/2024, తేదీ 23.01.2024) నమోదైంది. ఐపీసీలోని 427, 447, 506 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. రెసిడెన్షియల్ ప్లాట్‌గా ఉన్న స్థలాన్ని నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించే ప్రయత్నం చేశారని, ప్రశ్నించినందుకు బెదిరించారని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు ఆయన భార్య నీలిమ, మరో వ్యక్తి మధుకర్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఘట్‌కేసర్ సమీపంలోని చౌదరిగూడ గ్రామంలో సర్వే నెం. 796లోని 150 చ.గజాల విస్తీర్ణం ఉన్న ప్లాట్ (నెం. 18)ను అక్రమంగా స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నం జరిగిందని ఉప్పల్ సమీపంలోని బుద్ధనగర్‌కు చెందిన ముచ్చెర్ల రాధిక ఈ నెల 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చౌదరిగూడ గ్రామంలోని సర్వే నెం. 796లో 1984, 1985 సంవత్సరాల్లో ఆ స్థలం యజమాని ఎంఏ రషీద్ (రామాతపూర్‌లో నివాసం) 167 ప్లాట్లు చేసి విక్రయించారని, అందులో 150 చ. గజాల విస్తీర్ణం ఉన్న ఒక ప్లాట్‌ను తాను 2010లో ఊటుకూరు మల్లేశం (గుండెల మండలం) నుంచి కొనుగోలు చేశానని (డాక్యుమెంట్ నెం. 1862/2010) ఆ ఫిర్యాదులో రాధిక పేర్కొన్నారు. అప్పటి నుంచీ తన పేరు మీదనే రిజిస్టర్ అయిన ఆ స్థలం తన ఆధీనంలోనే ఉన్నదని, రక్షణ కోసం చుట్టూ కొన్ని స్థంభాలు పాతి ప్రహరీని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్టుకు చెందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆయన భార్య నీలిమ, మరొకరు మధుకర్ రెడ్డి ఎలాంటి అనుమతి లేకుండా ప్లాట్‌లోకి చొరబడ్డారని పేర్కొన్నారు.

స్థలం చుట్టూ ఏర్పాటు చేసిన సరిహద్దు స్థంభాలను తొలగించారని, తనతో పాటు తన భర్త సిద్దేశ్వర్ ఈ విషయాన్ని ప్రశ్నించామని, అసభ్య పదజాలంతో దూషించి బెదిరించారని రాధిక ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో డూప్లికేట్ డాక్యుమెంట్లు సృష్టించి లేఔట్ వివరాలను మార్చేశారని, ఆ స్థలం గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్టుకు చెందినదే అంటూ దబాయించారని ఆమె వివరించారు. పైగా ఆ స్థలాన్ని వ్యవసాయ భూమిగా కన్వర్టు చేశారని, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకే ఈ వ్యవహారం నడిచిందని రాధిక తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులోని అంశాలను పరిశీలించిన తర్వాత పోలీసులు మూడు సెక్షన్ల కింద పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆయన భార్య నీలిమ, మధుకర్ రెడ్డిలపై కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ రూపొందించారు.

ఈ స్థలానికి (ప్లాట్ నెం. 18, సర్వే నెం. 796) సంబంధించిన పత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు, లింకులోని మరికొన్ని డాక్యుమెంట్లను సమర్పిస్తే తదుపరి దర్యాప్తుకు ఉపయోగకరంగా ఉంటుందని రాధికకు ఇన్వెస్టిగేషన్ అధికారి సూచించారు.

Next Story

Most Viewed