నెమ్మదించిన ‘దోస్త్’.. మిగిలింది 4 రోజులే..!

by  |
dosth
X

దిశ, తెలంగాణ బ్యూరో: దోస్త్ వెబ్‌సైట్‌కు మందకోడిగా దరఖాస్తులు నమోదవుతున్నాయి. ఈ నెల 9 వరకు డిగ్రీ సీట్లలో కోసం దోస్త్ వెబ్‌సైట్‌లో కేవలం 63,623 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. చివరి తేది ఈనెల 15 చివరి తేది కావడంతో 4 రోజుల్లో దరఖాస్తులు సంఖ్య పెరుగుతాయా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇంటర్‌లో 4,73,850 మంది విద్యార్థులు పాస్ కాగా వీరిలో అత్యధికంగా 2,46,110 మంది విద్యార్థులు ఎంసెట్‌కు దరఖాస్తులు చేసుకున్నారు.

ఈ ఏడాది కరోనా కారణంతో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫీజులు చెల్లించిన 4,73,850 మంది విద్యార్థులందరినీ ప్రభుత్వం పాస్ చేసింది. వీరిలో అత్యధికంగా డిగ్రీలో చేరుతారని అధికారులు అంచనా వేశారు. కానీ ఆశించిన స్థాయిలో దోస్త్ వెబ్‌సైట్‌కు దరఖాస్తులు నమోదు కాలేదు. ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో, బీటెక్, బీఫార్మసీ, అగ్రికల్చర్ వంటి కోర్సుల్లో చేరేందుకు ఎక్కువగా దరఖాస్తులు చేసుకుంటున్నారు.

దోస్త్ వెబ్‌సైట్‌కు 63,623 దరఖాస్తులు..

ప్రభుత్వం జులై 1 నుంచి దోస్త్ వెబ్‌సైట్‌లో దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్రంలోని 1,060 డిగ్రీ కళాశాలల్లో 4.25 లక్షల సీట్లను భర్తీ చేపట్టేందుకు ఏర్పాట్లను సిద్ధం చేసింది. గతేడాది 1.80లక్షల మంది డిగ్రీలో చేరగా ఈ ఏడాది విద్యార్థులు భారీగా డిగ్రీలో చేరుతారని అధికారులు అంచనా వేశారు. కానీ అంచనాలు తారుమారు చేసేలా ఈ నెల 9 వరకు కేవలం 63,623 మంది విద్యార్థులు మాత్రమే దోస్త్ వెబ్‌సైట్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 51,442 మంది విద్యార్థులు ఫీజులు చెల్లించగా మొదటి ఫేజ్‌లో 27,206 మంది విద్యార్థులు మాత్రమే ఇప్పటి వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకున్నారు. మొదటి విడత దరఖాస్తులకు చివరి తేది ఈ నెల 15 వరకు మాత్రమే ప్రభుత్వం గడువును విధించింది. ఇంకా 4 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అధికారులు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు నమోదవుతయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఎంసెట్‌కు 2,46,110 మంది దరఖాస్తు..

ఎంసెట్ పరీక్షకు హాజరయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 2,46,110 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజినీరింగ్ విభాగం కోసం 1,61,823 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల కోసం 84,287 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో పాసైన సగానికి పైగా విద్యార్థులు ఎంసెట్ పరీక్ష రాసేందుకే దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. డిగ్రీ విద్యలో కంటే ఇంజినీరింగ్, బీఫార్మసీ, అగ్రికల్చర్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో చేరేందుకే విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.



Next Story

Most Viewed