పెట్టుబడుల్లో గుజరాత్ తర్వాత మనమే : కేటీఆర్

by  |
పెట్టుబడుల్లో గుజరాత్ తర్వాత మనమే : కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్ :
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం మనకు గర్వకారణమని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గుజరాత్‌ తర్వాత తెలంగాణలోనే పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని వివరించారు. శనివారం రంగారెడ్డిజిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్‌ మండలం చందనవెల్లి గ్రామంలో వెల్పూస్‌ ఫ్లోరింగ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. చందనవెల్లి పారిశ్రామిక వాడలో ప్రారంభమైన మొదటి కంపెనీ అని తెలిపారు. చందనవెల్లి పేరు సిలికాన్‌వ్యాలీలో కూడా వినిపిస్తుందన్నారు. ఇందులో వింబుల్డన్‌లో వాడే టవళ్లు ఇక్కడి నుంచి ఉత్పత్తి కానున్నాయని చెప్పుకొచ్చారు.కంపెనీ ఏర్పాటుకు అవసరమైన స్థలసేకరణకు సహకరించిన రైతులకు, నేతలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

కొంత మంది రైతుల త్యాగం వలన ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం కలుగుతుందన్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు.. వారికి అవసరమైన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం ప్రభుత్వం శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తుందని మంత్రి స్పష్టంచేశారు.ప్రస్తుతం 4 కంపెనీలు నిర్మాణంలో ఉండగా, మరో 4 కంపెనీలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. భవిష్యత్‌లో మరో 40 నుంచి 50 కంపెనీలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇక్కడి ప్రాంత ప్రజలు సహకరిస్తే 3600 ఎకరాల్లోరాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడను ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తామన్నారు. శంషాబాద్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 220కోట్లు మంజూరు చేస్తామన్నారు. అలాగే 220కెవీ సబ్‌స్టేషన్‌ను కూడా మంజూరు చేస్తామన్నారు. రూ.50కోట్లతో హైదరాబాద్‌- నాగర్‌గూడ రోడ్డు నిర్మాణం చేస్తామన్నారు.

విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ చొరవతో షాబాద్‌ మండలం చందనవెల్లిలో ఇంత పెద్ద సంస్థ ఏర్పాటు కావడం వలన ఇక్కడి ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తున్నకేటీఆర్‌ భవిష్యత్‌ ఆశాదీపమని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ కంపెనీల ఏర్పాటుతో స్థానికంగా 20వేల మందికి ఉపాధి లభించడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఐటీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేశ్‌రంజన్‌, జెడ్పీ ఛైర్‌ పర్సన్‌ అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Next Story

Most Viewed