Paddy Purchases : ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రికార్డు

by  |
Paddy Purchases : ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రికార్డు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రికార్డ్ స్థాయిలో ఈ ఏడాది యాసంగిలో ధాన్యం కొనుగోలు చేపట్టామని పౌరసరఫరాల శాఖ చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గత ఏడాది యాసంగిలో పౌరసరఫరాల సంస్థ 64.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఈ ఏడాది యాసంగిలో 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని శనివారం ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏడు సంవత్సరాల్లో వ్యవసాయరంగం గణనీయంగా అభివృద్ధి చెందిందని కొనియాడారు. రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాది 2014-15లో 13.24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా నేడు 67 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు.

ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం ఏర్పడటం వలనే రైతులు ఎంతో ఆత్మవిశ్వాసంతో పంటలు పండిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ యాసంగిలో ఇంకా 10 నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. గత ఏడాది ఇదే సమయానికి 56.82 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా ఈ ఏడాది ఇప్పటి వరకు 10లక్షల మంది రైతుల నుండి రూ.12,247 కోట్ల విలువచేసే 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, కొత్తగూడెం, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయని వివరించారు.


Next Story

Most Viewed