కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి: తెలంగాణ మంత్రులు

by  |
కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి: తెలంగాణ మంత్రులు
X

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్: కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నుతోంది.. అందులో భాగంగా విద్యుత్ శాఖను సైతం ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తోందని.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డిలు పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అప్పనపల్లి వైట్ హౌస్‌లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో.. నిర్వహించిన 4వ జనరల్ కౌన్సిల్ సమావేశానికి మంత్రులతో పాటు విద్యుత్ శాఖ సీఎండీ రఘుమారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖ వల్లే మంచి పేరు వచ్చిందన్నారు. అధికారులు, సిబ్బంది నిరంతరం శ్రమించడంతో మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్టు గుర్తు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ శాఖ సిబ్బందికి మంచి వేతనాలు ఇస్తున్నారన్నారు. మరో ఇరవై ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది.. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ భరోసా ఇచ్చారు.

అనంతరం జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి కుట్రలు పన్నుతోందన్నారు. ఆ కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తుందని చెప్పారు. విద్యుత్ శాఖ సిబ్బంది సైతం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని జగదీష్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో 1104 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పద్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయిబాబు, సుధాకర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed