వెలిగొండను ఆపండి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

by  |
వెలిగొండను ఆపండి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. వెలిగొండ ప్రాజెక్టు పనులను నిలిపి వేసేలా ఆదేశించాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్​రావు సోమవారం లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టును ఏపీ అక్రమంగా నిర్మిస్తోందని, ప్రాజెక్టు పనులను నిలిపి వేసేలా ఆదేశించాలని లేఖలో కోరారు. అంతేకాకుండా.. తాగునీటి కోసం వినియోగించే జలాలను 20 శాతం మాత్రమే లెక్కించాలని లేఖలో పేర్కొంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం 20 శాతంగానే లెక్కించాలని మరో లేఖ కూడా రాశారు.

కృష్ణా జలాల్లో వాటాలతో పాటు కేంద్రం ఇచ్చిన గెజిట్, బోర్డు పరిధిని చర్చించేందుకు ఈ నెల 27న కేఆర్ఎంబీ సమావేశం నిర్వహించనుండగా ఏపీ, తెలంగాణకు చెందిన సభ్యులు హాజరు కావాలంటూ బోర్డు ఇప్పటికే లేఖలు రాసింది. ఈ క్రమంలో వెలిగొండ ప్రాజెక్ట్ ఆపాలంటూ తెలంగాణ లేఖ రాయడం సంచలనంగా మారింది. దీనిపై ఏపీ ఏవిధంగా స్పందిస్తుందనేది ఇరిగేషన్​ ఇంజినీర్లలో చర్చగా మారింది.

లేఖలతో వివాదం..

కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య లేఖల వివాదం కొద్దిరోజులుగా నడుస్తోంది. ఈ రెండు రోజుల్లోనే ఇరు ప్రభుత్వాలు కేఆర్ఎంబీకి లేఖలు పంపించాయి. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఉత్పాదనపై కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శికి ఏపీ జలవనరుల శాఖ ఇంజినీరింగ్ చీఫ్‌ లేఖ రాశారు. అవసరం లేకున్నా విద్యుత్ ఉత్పత్తి చేయటం వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటిమట్టం 854 అడుగులకు చేరితే రాయలసీమకు నీరివ్వలేమని ఈఎన్‌సీ పేర్కొన్నారు. తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నై నగరానికి కూడా తాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. విద్యుత్ ఉత్పాదన ద్వారా విడుదలవుతున్న నీటిని నాగార్జునసాగర్‎లో నిలిపే అవకాశం లేదని వివరించారు. ఫలితంగా విలువైన జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పాదనను తక్షణమే నిలిపి వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేఆర్ఎంబీని కోరారు.

మరోవైపు ఈ ఏడాది నుంచి చెరిసగం నీటిని వాడుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బోర్డుకు లేఖ రాసింది. దీంతో 2021-22 సంవత్సరంలో కృష్ణ జలాల వినియోగంపై బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. తమ వాటాలో మిగిలిన నీటిని వచ్చే ఏడాది వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ దీన్ని వ్యతిరేకిస్తోంది. బోర్డు సూచనలతో రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ సూచించింది. తెలంగాణ అందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం తాగునీటి కోసం వినియోగించే జలాలు 20 శాతం మాత్రమే లెక్కించాలని సదరు లేఖలో కోరింది. అలాగే ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించేందుకు వెలిగొండ ప్రాజెక్టును చేపట్టిందని, ఈ అక్రమ ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే ఆపివేయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.


Next Story