హోంమంత్రి కీలక భేటీ.. తెలంగాణలో లాక్‌డౌన్?

by  |
lockdown, telangana
X

తెలంగాణలో లాక్​డౌన్ వైపు అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. కరోనా కట్టడి చేసేందుకు లాక్​డౌన్​ లేదా అదే తరహాలో కఠిన ఆంక్షలు వెలువరించే అవకాశం ఉన్నది. హోం మంత్రి మహమూద్​ అలీ డీజీపీ ముగ్గురు కమిషనర్లతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో లాక్​డౌన్​ నిర్ణయం సీఎం తీసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రణాళికబోర్డు ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్​కలెక్టర్లతో మాట్లాడుతూ.. పాఠశాలలు, హాస్టళ్లను ఐసొలేషన్​ కేంద్రాలు మార్చాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ సైతం అలర్ట్​ అయ్యింది. లాక్​డౌన్​ ఏర్పాటు చేస్తే నిరాశ్రయులకు ఇబ్బందిరాకుండా ఉండేందుకు ప్రత్యేక షెల్టర్లకు తరలిస్తున్నది. ఈ పరిణామాలన్నీ లాక్​డౌన్​కు సంకేతాలేనని తెలుస్తున్నది. సీఎం కేసీఆర్​ సమీక్ష అనంతరం నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: మే మొదటి వారంలో మళ్లీ లాక్​డౌన్​ ఉండొచ్చన్న సంకేతాలొస్తున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలే అందుకు బలం చేకూర్చుతున్నాయి. గతేడాది తరహాలో కాకపోయినా.. ప్రజల కదలికలను నియంత్రించే ఆంక్షలు ఉండొచ్చన్నది కేంద్ర నిఘా వర్గాల సమాచారం. రక్షణ రంగంలోని త్రివిధ దళాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తున్నది. రాష్ట్రంలోనూ అలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. హోం మంత్రి మహమూద్ ఆలీ డీజీపీ, ముగ్గురు పోలీసు కమిషనర్లతో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునేది ముఖ్యమంత్రి మాత్రమేనని హోం మంత్రి వ్యాఖ్యానించారు. మరోవైపు అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలను ఐసొలేషన్ కేంద్రాలుగా మార్చేలా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ఏమేం చర్యలు తీసుకోవాలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు వివరించారు. ఇంకోవైపు పోలీసు శాఖ తరఫున అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఐజీలను ఇంటెలిజెన్స్ చీఫ్ ఆదేశించినట్లు తెలిసింది. హైదరాబాద్ లో వీధుల్లో బతికే నిరాశ్రయులను నైట్ షెల్టర్లకు తరలించే ప్రక్రియ జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో మొదలైంది. నిరాశ్రయులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని హైకోర్టు సైతం ఆదేశించింది. లాక్‌డౌన్ ఉంటుందన్న ఊహాగానాలు ప్రజలను కిరాణాషాపులవైపు నడిపించాయి. ఏ క్షణం ఎలాంటి నిర్ణయం వినాల్సి వస్తుందోనని నెల రోజులకు సరిపడేలా సామగ్రిని జనం సమకూర్చుకుంటున్నారు.

కేంద్రంతో పాటే రాష్ట్రం

రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానుగా లాక్‌డౌన్ నిర్ణయం తీసుకోకపోవచ్చని, కేంద్రం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా అమలు చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మే 2వ తేదీ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర మంత్రివర్గం సమావేశమై తీసుకునే నిర్ణయాన్ని పరిశీలించిన తర్వాత రాష్ట్రం ఆ దిశగా అడుగులు వేయవచ్చని సమాచారం. విమాన సర్వీసుల్లో కొన్ని ఆంక్షలు విధించడం, కొన్ని దేశాలు విమాన సర్వీసులను రద్దు చేయడం, అమెరికా వీసాల మంజూరును తాత్కాలికంగా రద్దు చేసుకోవడం, కొన్ని రైలు సర్వీసులను రద్దు చేయడం.. ఇలాంటి పరిణామాలన్నీ త్వరలో తీసుకోబోయే సంచలన నిర్ణయానికి కొనసాగింపు అనే అనుమానాలున్నాయి. లాక్‌డౌన్‌తో ప్రజల జీవనోపాధికి నష్టం ఉంటుందనేది ప్రజలకు స్వీయానుభవమే అయినా నగరంలో, రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు, ఆస్పత్రుల్లో బెడ్‌లు దొరకకపోవడం, కరోనా కారణంగా చనిపోయేవారి సంఖ్య ఎక్కువవుతూ ఉండడం.. వీటిని పరిగణనలోకి తీసుకుని కొంతకాలమైనా అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వ్యాపార సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలు, గ్రామాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించుకున్నాయి. నైట్ కర్ఫ్యూ పెట్టినా కేసులు పెరుగుతూనే ఉన్నాయని హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. కేసులు పెరగడాన్ని దృష్టిలో పెట్టుకుని పొరుగున ఉన్న రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించుకున్నాయి.

సీఎం భేటీ తర్వాత స్పష్టత

ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల్లో ప్రగతి భవన్‌లో నిర్వహించే సమీక్ష తర్వాత లాక్‌డౌన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించనున్నారు. కట్టడి కోసం తీసుకున్న చర్యలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం, ఇంకా కేసులు ఎంత కాలం పెరుగుతాయి, నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజల్లో నెలకొన్న భయాలను పారదోలేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు తదితరాలన్నింటిపై చర్చించి అధికారికంగా వెల్లడించనున్నారు. ఆ సమావేశం తర్వాతనే లాక్‌డౌన్ లేదా కఠిన ఆంక్షలపై స్పష్టత రానుంది.

Next Story

Most Viewed