మాస్కు తప్పనిసరి.. లేదంటే కేసులే

by  |
మాస్కు తప్పనిసరి.. లేదంటే కేసులే
X

దిశ, క్రైమ్‌బ్యూరో : యావత్తు ప్రపంచాన్ని ఏడాది కాలంగా వణికిస్తున్న కొవిడ్ – 19 మహమ్మారితో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి అయింది. దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం గతేడాది (2020) మార్చి 23 నుంచి లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ క్రమంలో మార్చి 23 తర్వాత కరోనా వైరస్ నుంచి మనల్నీ మనం కాపాడుకోవడానికి తప్పనిసరిగా మాస్క్ ధరించాలనే ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రకారం మాస్క్ ధరించని వారికి రూ.1000 జరిమానా విధించేలా ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు. దీంతో మాస్క్ ధరించకుండా బయటకొచ్చిన వారిపై పలు కేసులు నమోదు చేసింది.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది కాలంలో (2020 మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకూ) సుమారు 1.10 లక్షల కేసులు నమోదు అయినట్టు పోలీసు శాఖ అధికారులు చెబుతున్నారు. ఏడాది కాలంగా నమోదయిన 1.10 లక్షల కేసులకు రూ.1000 చొప్పున రూ.10 కోట్లకు పైగా జరిమానాలు వసూలయినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. కొవిడ్ -19 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ -2005 ప్రకారం జీవో ఎమ్మెస్ నెంబరు 68ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విడుదల చేశారు. మాస్క్ ధరించకుంటే కఠిన చర్యలు ఉంటాయని, వీటి అధికారాలను జిల్లా కలెక్టర్లకు, కమిషనర్లకు, ఎస్పీలకు కల్పిస్తూ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.



Next Story

Most Viewed