పీఆర్సీపై ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడిందా..?

by  |
పీఆర్సీపై ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడిందా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ఏ మేరకు పెంచాలో నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ కమిషన్‌ను నియమించింది. రెండున్నరేళ్ల పాటు కసరత్తు చేసి ఏడున్నర శాతాన్ని సిఫారసు చేసింది. కానీ ప్రభుత్వం మాత్రం దానికి నాలుగు రెట్లు ఎక్కువ చేసి 30శాతం ప్రకటించింది. కమిషన్ సిఫారసులకన్నా ఎక్కువే ఇచ్చామని ప్రభుత్వం క్రెడిట్ కొట్టేసింది. సిఫారసు ఎలా ఉన్నా అంతిమ నిర్ణయం సర్కారుదేని తేలిపోయింది.

కానీ సిఫారసుతో పొంతన లేకుండా భారీస్థాయిలో ఖరారు చేయడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. వేతన సవరణ కమిషన్‌కు విలువ లేదని, ఎలాంటి సిఫారసులు చేసినా ప్రభుత్వం అనుకున్నదే చేస్తుందని కొన్నేళ్ల అనుభవం తేటతెల్లం చేస్తోంది. వేతన సవరణ ఆలస్యం కావొద్దని ముగ్గురు సభ్యులతో వేసిన 11వ పీఆర్సీ కమిషన్ పై ప్రభుత్వం సుమారు రూ.15కోట్లు ఖర్చుచేసింది. ముగ్గురు సభ్యులకు రూ.లక్షల్లో వేతనాలు ఇచ్చింది. కార్లు సమకూర్చింది. అసిస్టెంట్లనూ నియమించింది. ఇతర రాష్ట్రాలకూ వెళ్లి ఈ కమిషన్ అధ్యయనం చేసింది. సిఫారసు చేసిన ఫిట్ మెంట్ 7.5 శాతమే. కమిషన్ స్వతహాగానే ఈ మేరకు తక్కువగా సిఫారసు చేసిందా? లేక ప్రభుత్వమే అలా ఇప్పించిందా? అనే చర్చ కూడా తెరపైకి వస్తోంది.

ఎక్కువ సిఫారసు చేసి తక్కువ ఇచ్చినట్లయితే అది ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. కావునా ఉద్దేశపూర్వకంగానే తక్కువ సిఫారసు చేయించి ఇప్పుడు ఎక్కువ ఇవ్వడం ద్వారా ‘ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం’ అనే గుర్తింపు పొందగలిగింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఏడున్నర శాతం కంటే ఎక్కువ ఇవ్వడం సాధ్యం కాదని బిస్వాల్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నా ప్రభుత్వం మాత్రం నాలుగు రెట్ల ఆర్థిక భారాన్ని మోయడానికే సిద్ధమైంది. కమిషన్ అధ్యయనంలో ఆర్థిక ఇబ్బందులున్నాయనేది సరైందా? కాదా? అనే చర్చ మేధావుల్లో మొదలైంది.

గతంలోనూ అంతే..

వేతన సవరణ కమిషన్లు గతంలో ఎలాంటి సిఫారసులు చేసినా ప్రభుత్వాలు మాత్రం పెంపుతోనే నిర్ణయాలే తీసుకున్నాయి. ఒకటి, రెండు సందర్భాల్లో మినహా మిగిలిన సమయాల్లో కమిషన్ సూచించిన దానికంటే ఎక్కువగానే ఇచ్చాయి ప్రభుత్వాలు. 1958, 1965 ఏడాదిల్లో కమిషన్ సూచించిన ఫిట్ మెంట్ మేరకే ప్రభుత్వాలు ఖరారుచేశాయి. 1974లో రిటైర్డ్ ఐసీఎస్ ఆర్.ప్రసాద్ కమిషన్ ఐదుశాతం ఫిట్ మెంట్ సూచిస్తే ప్రభుత్వం అంతే ప్రకటించింది.

కానీ కొన్ని ప్రయోజనాలను మాత్రం అదనంగా చేర్చింది. 1978లో రిటైర్డ్ ఐఏఎస్ క్రిష్ణస్వామి కమిషన్ మొత్తంగా రెండుశాతం ఇంక్రిమెంట్లను సూచించగా ప్రభుత్వం మాత్రం మూడేండ్ల వరకు ఒక ఇంక్రిమెంట్, 3 నుంచి 7 ఏళ్లకు రెండు ఇంక్రిమెంట్లు, ఏడేళ్ల పైమేరకు మూడు ఇంక్రిమెంట్లను ప్రకటించింది. ఆ తర్వాత 1985లో ఐఏఎస్ సుబ్రమణ్యం కమిటీ సూచించిన 10 శాతం ఫిట్ మెంట్ తో పాటు అప్పటి ప్రభుత్వం అదనంగా చెల్లించింది. 1991లో రిటైర్డ్ ఐఏఎస్ శంకర్ కమిటీ 8 శాతం ఫిట్ మెంట్ ను సూచించగా ప్రభుత్వం 10 శాతం, మినిమం రూ.100 చొప్పున ప్రకటించింది.

ఆ తర్వాత 1998లో రిటైర్డ్ ఐఏఎస్ ఆర్ కేఆర్ గోనెల కమిషన్ 20 శాతం సూచించగా అప్పటి ప్రభుత్వం 25 శాతం ఫిట్ మెంట్ ప్రకటించింది. 2004లో రిటైర్డ్ ఐఏఎస్ రాంబాబు కమిటీ 10 శాతం సూచిస్తే అప్పటి ప్రభుత్వం 16 శాతం ఫిట్ మెంట్ ఇచ్చింది. 2008లో రిటైర్డ్ ఐఏఎస్ సీఎస్ రావు కమిషన్ 27 శాతం సూచిస్తే ప్రభుత్వం ఏకంగా 39శాతం ప్రకటించింది. ఇక 2013లో రిటైర్డ్ ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అగర్వాల్ కమిటీ 29 శాతంగా సిఫారసు చేసింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం, ఉద్యోగుల ఉద్యమ బంధంతో సీఎం కేసీఆర్ ఏకంగా 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించారు. ఇదే అత్యధిక ఫిట్ మెంట్ గా నిలిచింది.

ఈసారి కూడా బిశ్వాల్ కమిషన్ కేవలం 7.5 శాతానికి సూచిస్తే సీఎం కేసీఆర్ ఏకంగా 30శాతం ప్రకటించారు. ప్రభుత్వాలు తమ క్రెడిట్ కోసమే పీఆర్సీ నివేదికలను పక్కన పెట్టి విచక్షణాధికారంతో నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఒక వ్యూహం ప్రకారమే కమిషన్ తో తక్కువ ఫిట్ మెంట్ సిఫారుసు చేయించి, అనంతరం ఉద్యోగ సంఘాలతో చర్చలు పెట్టి, డిమాండ్లు పెట్టి ప్రభుత్వం ఎక్కువశాతం ఇచ్చి ఎల్లకాలం కృతజ్ఞతతో ఉండేలా చేసుకుంటున్నాయి. ఉద్యోగులను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈసారి కూడా అదే వ్యూహం అమలైందన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.

Next Story

Most Viewed