ఎత్తడం, పారబోయడం.. కాళేశ్వరం కేంద్రంగా సర్కస్ ఫీట్స్..!

by  |
kaleshwaram
X

దిశప్రతినిధి, కరీంనగర్: అత్యుత్సాహమా లేక అనాలోచిత చర్యలో తెలియదు కానీ, మరోసారి కాళ్శేశ్వరం నీరు ఎత్తిపోసి తప్పటడుగులు వేసినట్టు మాత్రం స్పష్టం అవుతోంది. వర్షాకాలం ముగియకముందే నీటిని ఎత్తిపోసి చెరువులు, కుంటలు నింపి జలకళ సంతరించుకుందని సంబురపడటానికి తప్ప మరో లాభం లేదని స్పష్టం అవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి సుమారు 30 టీఎంసీల నీటిని ఎగువకు ఎత్తిపోశారు. ఈ నీటితో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు అన్ని నింపేశారు. ఉన్నట్టుండి వర్షాలు భారీగా కురియడంతో ఇప్పుడు మళ్లీ నీటిని దిగువకు పంపిచాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా చెరువులు కుంటలను నింపేయడంతో వరద నీటితో వాగులు వంకలు పొంగిపొర్లుతున్న పరిస్థితి తయారైంది.

అంచనా వేయడంలో…

కాళేశ్వరం జలాలను ఎగువ ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అంచనాలు వేయడంలో విఫలం అవుతున్నారా..? లేక నీటిని లిఫ్ట్ చేయాలన్న ఒత్తిళ్లకు గురవుతున్నారా? తెలియదు కానీ వారి అంచనాలకు అనుగుణంగా వరుణుడు మాత్రం సపోర్ట్ చేయడం లేదని స్పష్టం అవుతోంది. గత సంవత్సరం అక్టోబర్ నెలాఖరు వరకు వేచి చూడాలని ఇంజనీర్లు సూచించినప్పటికీ ముందుగానే నీటిని లిఫ్ట్ చేశారు. దీంతో మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో ఎస్సారెస్సీ, కడెం ప్రాజెక్డులు నిండిపోయాయి. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా నీరు ఎల్లంపల్లికి చేరుకుంది. దీంతో అప్పటికే లిఫ్ట్ చేసిన నీటితో పాటు వరద నీటిని కూడా దిగువకు వదిలారు. దీనివల్ల డబ్బులు వృధా అయ్యాయే తప్ప మరో లాభం మాత్రం చేకూరలేదన్నది వాస్తవం. ఇప్పుడు కూడా వర్షాకాలం మధ్యలోనే కాళేశ్వరం జలాలను తరలించిన అధికారులు పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. దాదాపు పది రోజుల క్రితం నుండి ఈ నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లికి తరలించి అక్కడి నుండి నందిమేడారం, లక్ష్మీపూర్ పంప్ హౌజ్‌లు నింపేశారు.

వాటి నుండి మిడ్ మానేరుతో పాటు ఇతరాత్ర చెరువులు, కుంటలను కిటకిటలాడించి జలకళ ఉట్టిపడే ప్రయత్నం చేశారు. వర్షాకాలం మధ్యలోనే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కాకుండా పోయిందనే చెప్పాలి. కాళేశ్వరం లింక్ వన్, లింక్ టూ పరిధిలో నీటి వనరులను నింపేయడంతో ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో వరదలు మొదలయ్యాయి. సహజంగానే వచ్చే వర్షపు నీటి ద్వారా చెరువులు కుంటలు నిండే అవకాశం ఉంటుంది. వాటిని ఇప్పుడు నిలువ చేసుకుని అవసరాలకు వాడుకున్న తరువాత కాళేశ్వరం జలాలను తరలిస్తే ఖర్చు తగ్గేది. కానీ తొందరపడి నీటిని లిఫ్ట్ చేయడంతో అటు విద్యుత్ బిల్లుల మోత మోగడమే కాకుండా ఇటు వరదల్లో ప్రజలు చిక్కకునే పరిస్థితి తయారైంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో మూడు నాలుగు రోజుల్లో ఎస్సారెస్పీ కూడా ఎఫ్టీఎల్ లెవల్‌కు చేరుకుంటింది. దీంతో ఆ నీటిని కూడా దిగువకు వదిలే అవకాశం లేకపోలేదు. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను బార్లా తెరిచి నీటిని మళ్లీ కాళేశ్వరం మీదుగా సముద్ర గర్భంలోకి పంపించడం తప్ప మరో గత్యంతరం లేదనే చెప్పాలి.

అవే పూర్తయితే..

లింక్ 3లోని వివిధ ప్రాజెక్టులు పూర్తయితే వరదల రూపంలో వచ్చిన నీటినే పెద్ద ఎత్తున తరలించుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల ఎల్లంపల్లి నుండి డైరక్ట్‌గా నీటిని లింక్ 3 పరిధిలోని రిజర్వాయర్లకు తరలించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా చేయడం వల్ల కాళేశ్వరం నుండి నీటిని లిప్ట్ చేసేందుకు కొంతలో కొంత అయినా ఖర్చు తగ్గే అవకాశాలు కూడా లేకపోలేదు.

అడ్డంగా బుక్కైన మంత్రులు.. వీడియో వైరల్!



Next Story

Most Viewed