సీఎస్‌కు ​తెలంగాణ ఉద్యోగ జేఏసీ అల్టిమేటం

by  |
సీఎస్‌కు ​తెలంగాణ ఉద్యోగ జేఏసీ అల్టిమేటం
X

దిశ, తెలంగాణ బ్యూరో : పీఆర్సీ అంశంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ.. సీఎస్‌కు అల్టిమేటం జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ఎందుకు వ్యవహరించడం లేదంటూ ప్రశ్నించింది. ఈ నెల మూడో వారంలో పీఆర్సీ అంశంపై పూర్తిస్థాయిలో తేల్చాలని సీఎం కేసీఆర్ సూచించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సీఎస్‌కు సూచించారు. త్రీమెన్ కమిటీ చర్చలకు పిలవకుంటే.. సీఎం కేసీఆర్‌ను కలుస్తామంటూ వెల్లడించారు. ఇప్పటి దాకా పీఆర్సీ కోసం ఎదురుచూసిన ఉద్యోగుల జేఏసీ ఒక్కసారిగా ఆగ్రహానికి గురైంది. దీంతో జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు.

నివేదిక ఇస్తారా.. లేదా?

పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాల నేతలకు ఎప్పుడో ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించినా అధికారులు ఆలస్యం చేస్తున్నారంటూ ఈ సందర్భంగా సీఎస్‌కు వివరించారు. ఈ నెల 6 లేదా 7 తేదీల్లోనే పీఆర్సీ నివేదికను సంఘాలకు ఇవ్వాలని సీఎం సూచించారని, కానీ ఇప్పటి వరకు నివేదికను ఓపెన్ చేశారా.. లేదా అంటూ ప్రశ్నించారు. త్రీమెన్ కమిటీ ఇంత వరకూ చర్చలకు పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు చర్చలకు పిలుస్తారా.. లేక నేరుగా ఫిట్‌మెంట్ ప్రకటిస్తారా? అంటూ ప్రశ్నించారు. దీనిపై తేల్చాలని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్​రాజేందర్​సీఎస్‌కు సూచించారు.

ఈ నెల 22 వరకు వేచి చూస్తాం

పీఆర్సీ నివేదిక అంశంలో ఈ నెల 22 వరకు వేచి చూస్తామని, లేకుంటే సీఎం కేసీఆర్‌ను కలుస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ.. సీఎస్‌కు అల్టిమేటం జారీ చేసినట్లు చెబుతున్నారు. ఈ నెల 22న సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వెల్లడించారు. పీఆర్సీ అంశంలో ఉద్యోగవర్గాల్లో ఉన్న అసంతృప్తిని దూరం చేయాలని, సీఎం ఇచ్చిన షెడ్యూల్‌ను అమలు చేయాలంటూ స్పష్టంగా వెల్లడించారు. త్రీమెన్​ కమిటీ వెంటనే ఉద్యోగుల అంశంలో చొరవ తీసుకోవాలని, ఆలస్యం చేస్తే పరిణామాలు మారుతాయంటూ హెచ్చరించినట్లు తెలుస్తోంది. 50 వేల ఉద్యోగాల భర్తీ, పీఆర్సీ అమలు, ఉద్యోగుల వయో పరిమితి పెంపుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, వేతన సవరణ కమిషన్​ఇచ్చిన నివేదికను వెల్లడించాలంటూ ఈ సందర్భంగా డిమాండ్​ చేశారు.

ఉద్యోగుల మధ్య అగాధాన్ని సృష్టిస్తారా?

సీఎస్‌తో భేటీ అనంతరం జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్​ మీడియాతో మాట్లాడారు. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో సమావేశం కావాలని సీఎం కేసీఆర్.. త్రీమెన్ కమిటీకి చెప్పినా ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం సరికాదన్నారు. ఇప్పటికే ఉద్యోగులు పీఆర్సీ అంశంలో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, వచ్చేనెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోందని, వెంటనే పీఆర్సీ అంశాన్ని తేల్చాలని కోరామన్నారు. పీఆర్సీ అంశంలో ఉద్యోగుల మధ్య అగాధాన్ని సృష్టించే విధంగా ప్రయత్నాలు చేస్తే ఊరుకోమని రాజేందర్​వెల్లడించారు. కాగా పీఆర్సీ అంశంలో వరుస సెలవుల కారణంగా ఆలస్యం జరుగుతోందని సీఎస్.. ఉద్యోగ సంఘాలకు వివరించినట్లు చెబుతున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని, పదోన్నతుల ప్రక్రియ వేగంగా చేస్తున్నట్లు సీఎస్ వివరించారని జేఏసీ ప్రకటించింది. సీఎస్‌తో భేటీ అయిన వారిలో జేఏసీ సెక్రెటరీ జనరల్ మమత, సెక్రెటరీలు రాయకంటి ప్రతాప్, ఏనుగుల సత్యనారాయణ ఉన్నారు.


Next Story

Most Viewed