తెలంగాణలో డాక్టర్లకు అంతుచిక్కని జ్వరాలు.. ఆందోళనలో జనాలు

by  |
తెలంగాణలో డాక్టర్లకు అంతుచిక్కని జ్వరాలు.. ఆందోళనలో జనాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం విజృంభిస్తోన్న జ్వరాలను డాక్టర్లు సైతం పసిగట్టలేకపోతున్నారు. కరోనా ప్రభావంతో లక్షణాలను బట్టి ఎలాంటి జ్వరమో గుర్తించలేని పరిస్థితులు నెలకొన్నాయి. సీజనల్ జ్వరాలు, కరోనా సింప్టమ్స్ ఒకే విధంగా ఉండటంతో వాటిని గుర్తుపట్టడం ప్రజలతో పాటు డాక్టర్లకూ సాధ్యం కాకపోవడం గమనార్హం. ఎంబీబీఎస్ నుంచి ఎండీ డాక్టర్ల వరకూ ఇదే వంతు. దీంతో జ్వర, ఇతర అనారోగ్య లక్షణాలతో డాక్టర్‌ను సంప్రదిస్తే డెంగీ, టైఫాయిడ్, మలేరియా, వైరల్ ఫీవర్ వంటి రకరకాల టెస్టులన్నీ రాస్తున్నారు. కానీ ఆ రిపోర్టులు వచ్చే సరికి కనీసం రెండు మూడు రోజుల పడుతుందని పేషెంట్లు చెబుతున్నారు. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖానాల్లోనైతే కనీసం నాలుగైదు రోజుల సమయం పడుతుందని స్వయంగా మెడికల్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. వాస్తవంగా ఈ కేంద్రాలకు వచ్చే శాంపిల్స్‌ను తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలకు పంపిస్తారు. అక్కడ శాంపిల్స్ లోడ్ ఎక్కువుండటంతో రిపోర్టులకు ఆలస్యం అవుతుందని పీహెచ్ సీల్లోని డాక్టర్లు వివరిస్తున్నారు.

పేషెంట్లలో గందరగోళం..

వ్యాధి నిర్ధారణ నివేదికలు ఆలస్యం కావడంతో జనాల్లో గందరగోళం నెలకొన్నది. డాక్టర్లు సైతం రిపోర్టులు లేకుండా కనీసం ప్రాథమిక వైద్యం కూడా అందించకపోవడంతో బాధితులు టెన్షన్‌కు గురవుతున్నారు. జ్వరం వచ్చిన తర్వాత రెండు మూడు రోజుల వరకు వైద్యం అందకపోవడంతో పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది పరిస్థితి విషమ స్థాయిలోకి కూడా వెళ్తున్నది. అందాల్సిన సమయానికి వైద్యం అందకపోవడంతో కొందరి శరీరం చికిత్సకు కూడా సహకరించడం లేదని ఫీవర్ ఆసుపత్రికి చెందిన ఓ కీలక డాక్టర్ చెప్పారు. ప్రైవేట్ క్లీనిక్‌లు, ఆసుపత్రుల్లో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయన్నారు. కానీ, ఫీవర్‌లో ఉదయం సేకరించిన శాంపిల్స్‌కు సాయంత్రం వరకు రిపోర్టులు ఇచ్చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అంతేగాక ప్రైమరీ టెస్టుల్లో పేషెంట్ పరిస్థితి సీవియర్‌గా కనిపిస్తే వెంటనే అడ్మిట్ చేసుకుంటున్నామన్నారు.

కొవిడ్ టెస్టు మస్ట్..

దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, నీరసం, నరాలు గుంజటం, కడుపులో నొప్పి తదితర వీటిలో ఏ ఒక్క లక్షణం ఉన్నా డాక్టర్లు వెంటనే కరోనా టెస్టుకు రిఫర్ చేస్తున్నారు. యంటీజెన్‌లో నెగిటివ్ ఉన్నా, లక్షణాలు ఉంటే ఆర్టీపీసీఆర్ తప్పనిసరి అంటున్నారు. కొందరికి సీటీ స్కాన్‌ను కూడా అడుగుతున్నారు. ఈ టెస్టులు ఉంటేనే డాక్టర్లు నాడీ పడుతున్నారు.

కరోనా, సీజనల్ జ్వరాల లక్షణాలు ఇంచుమించు ఒకే విధంగా ఉండటంతో ఏది కరోనా? ఏది వైరల్ జ్వరమో? గుర్తు పట్టడం తమకు కూడా సాధ్యపడటం లేదని, పేషెంట్ల మంచి కొరకే కరోనా టెస్టును తప్పనిసరి చేశామని ఓ ప్రైవేట్ క్లినిక్‌కు చెందిన డాక్టర్ చెప్పారు. అంతేగాక ఒక్కో జ్వరానికి ఒక్కో రకపు ట్రీట్మెంట్ ఉండటంతో ఇలా రిఫర్ చేస్తున్నామన్నారు. లక్షణాలు బట్టి ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితులు లేవని, వైరల్ జ్వరాలకు కరోనా మెడిసిన్ వాడితే రియాక్షన్లు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇటీవల ఏపీకి చెందిన ఓ డాక్టర్ విషయంలోనూ అదే జరిగిందని ఆయన వివరించారు. మిక్స్ డ్ వైద్యంతో అప్పటి వరకు బాగానే ఉన్న పేషెంట్ సీరియస్ పరిస్థితుల్లోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. కొందరు కోమాకు కూడా వెళ్లోచ్చన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా అడుగుతున్నామన్నారు.

ఒక్కసారి జ్వరం వస్తే కనీసం రూ.3 వేల ఖర్చు…

ప్రస్తుత పరిస్థితుల్లో ఓ వ్యక్తికి ఒక్కసారి జ్వరం వస్తే నిర్ధారణ పరీక్షల కోసం చిన్నపాటి ల్యాబ్, క్లినిక్, ఆసుపత్రుల్లో కనీసం రూ. 3 వేలు ఖర్చవుతున్నాయి. ఇక పెద్ద ప్రైవేట్, కార్పొరేట్ ల్యాబ్స్, ఆసుపత్రుల్లోనైతే దీనికి నాలుగైదు రెట్లు ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. దీంతో సగటు సామాన్యుడికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు భారంగా మారాయి. ప్రభుత్వం చెబుతునట్లు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో, తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లతో డాక్టర్లు రాసిన అన్ని రకాల టెస్టులు లభించడం లేదు. కొన్ని కేంద్రాల్లో ఉన్నా, రిపోర్టులు రావడానికి కనీసం నాలుగైదు రోజుల సమయం తీసుకుంటున్నారు. దీంతో అప్పటికే సదరు పేషెంట్ కు నష్టం జరిగిపోతున్నది.


Next Story

Most Viewed