ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్

by  |
ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సరం సమీపిస్తున్న సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. కొత్త సంవత్సరం కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అందరూ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో పాటు, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జుడ్ ఉద్యోగులు, డెయిలీ వైజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వాలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు. అన్నిరకాల ఉద్యోగుల కలిపి తెలంగాణలో 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగులున్న ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని, ఆర్టీసీపై పడే భారాన్ని కూడా ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

అంతేగాకుండా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సభ్యులుగా త్రిసభ్య అధికారుల సంఘాన్ని సీఎం నియమించారు.



Next Story