భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఆ ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం

by D.Reddy |
భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఆ ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం
X

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ (Operation sindoor) తర్వాత భారత్‌తో పాకిస్థాన్ కయ్యానికి కాలు దువ్వింది. సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతో ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఐటీ సంస్థలు (IT Companies) మళ్లీ వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ (Work from home) బాటపట్టాయి. ఉద్యోగుల భద్రతను దృష్ట్యాలో ఉంచుకుని ఢిల్లీ, ఛండీగఢ్, జైపూర్, అహ్మదాబాద్‌, నోయిడా, గురుగ్రామ్‌ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాయి.

టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్, ఈవై, కేపీఎంజీ, డెలాయిట్‌ సహా ఇతర ఐటీ, కన్సల్టింగ్ సంస్థలు ఈ మేరకు వర్క్‌ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించాయి. అలాగే, అత్యవసరం కాని ప్రయాణాలపై విరమించుకోవాలని, సరిహద్దు రాష్ట్రాల్లోని ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నాయి. పరిస్థితులు చక్కబడే వరకు జాగ్రత్తగా ఉండాలని తెలిపాయి. అంతేకాదు, ప్రస్తుత దేశ పరిస్థితులపై సోషల్ మీడియాల్లో కామెంట్లు చేయొద్దనీ, క్లైయిట్స్ సంభాషణల్లోనూ ప్రస్తావించొద్దని తమ ఉద్యోగులను పలు సంస్థలు కోరాయి.

కాగా, భారత్‌-పాక్‌ యుద్ధ నేపథ్యంలో పంజాబ్, హర్యాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్‌లలో ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రోటోకాల్‌ విధించిన సంగతి తెలిసిందే. అలాగే, సమస్యాత్మక జిల్లాల్లో తాత్కాలిక పాఠశాలల మూసివేతలు, విద్యుత్ అంతరాయాలు కొనసాగుతున్నాయి.



Next Story

Most Viewed