తస్మాత్ జాగ్రత్త.. Whatsapp యూజర్లకు కీలక హెచ్చరిక!

by Disha Web Desk 17 |
తస్మాత్ జాగ్రత్త.. Whatsapp యూజర్లకు కీలక హెచ్చరిక!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వాడుతున్నారు. ఇండియాలో దీనిని వాడే వారి సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో 10 రోజుల నుంచి భారత వినియోగదారులకు తరుచుగా ఇంటర్నేషనల్ నంబర్స్ నుంచి కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. వీటి గురించి చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ కాల్స్, మెసేజ్‌లలో ఎక్కువగా ఉద్యోగాలు, లోన్స్, లాటరీలను ఆఫర్ చేస్తున్నారు. కెన్యా, ఇథియోపియా, వియత్నాం, మలేసియా సహా ఇతర దేశాలకు చెందిన ISD కోడ్‌లతో సైబర్ మోసగాళ్లు మెసేజ్‌లు పంపుతున్నారు. అయితే, ఇదో పెద్ద స్కాం అని, ఎవరు కూడా ఇలాంటి మెసేజ్‌లు, కాల్స్‌లకు స్పందించొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సైబర్ మోసగాళ్ల చేతికి ఈ మొబైల్ నెంబర్స్ ఎలా వెళ్లాయని యూజర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ మెసేజ్‌లు, కాల్స్ ఎందుకు చేస్తున్నారో, వారి ఉద్దేశం ఏంటో మాత్రం ఇప్పటి వరకు తెలియదు. కానీ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్న దాని ప్రకారం, వ్యక్తిగత సమాచారం లేదా డబ్బును దోచుకోవడమే టార్గెట్‌గా వారు ఇలా చేస్తున్నారు.

వాట్సాప్ VoIP నెట్‌వర్క్ ద్వారా పనిచేస్తుంది. దీంతో వాట్సాప్‌లో ప్రపంచంలో ఏ దేశం నుంచైనా కాల్స్, మెసేజెస్ ఉచితంగా చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వీటి పట్ల యూజర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Next Story