‘పెండింగ్​’ ఫియర్​.. మ్యూటేషన్​ కాని వేలాది ఫైళ్లు

by  |
‘పెండింగ్​’ ఫియర్​.. మ్యూటేషన్​ కాని వేలాది ఫైళ్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ధరణి’ పోర్టల్ ఉద్యోగులను భయపెడుతోంది. పెండింగ్ ఫైళ్లు క్లియర్ చేయకపోవడంతో తలెత్తే సమస్యల గురించి తహసీల్దార్లు బెంబేలెత్తుతున్నారు. గత ఆర్నెళ్లుగా పెండింగులో ఉన్న పనులన్నీ ఇప్పుడు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మ్యూటేషన్ దస్త్రాలన్నీ మూలకు వేశారు. దీంతో కొనుగోలుదారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. రూ.లక్షలు పోసి కొనుగోలు చేసిన భూములపై హక్కులు కల్పించకపోతే, అమ్మినవాళ్లే తిరిగి అమ్మితే తమ పరిస్థితి ఏమిటని వారు వాపోతున్నారు. అప్పుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపు డ్యూటీ చెల్లించి కొనుగోలు చేశారు. తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ మ్యూటేషన్ చేయకుండా పెండింగులో ఉంచారు. ధరణి డేటాలో భూములు విక్రయించినవారి వివరాలే ఉన్నాయి. వాటిని మళ్లీ విక్రయించినా గుర్తించే దిక్కు లేదు. సాంకేతిక మద్దతు లేని కారణంగా జరిగే తప్పులకు బలి అయ్యే అవకాశాలు తలెత్తాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే మ్యూటేషన్ ఫైళ్లు పెద్ద సంఖ్యలో పెండింగులో ఉండిపోయాయి. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 2200 వరకు దరఖాస్తులను బుట్టదాఖలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 20 వేల వరకు ఉన్నట్లు సమాచారం. వేలాది మంది దగ్గర సేల్ డీడ్లు ఉన్నాయి. వారు కనీసం తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు కూడా చేసుకోలేదు. ఈ క్రమంలో జరిగే దొంగ రిజిస్ట్రేషన్లను ఎలా అడ్డుకోవాలో అంతుచిక్కడం లేదు.

మౌఖిక ఆదేశాలు ఇచ్చినా

‘ధరణి’ పోర్టల్ విజయవంతం కావాలంటే పెండింగు దరఖాస్తులను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాలి. త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున తప్పులు జరిగే అవకాశం ఉంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్యాక్ లాగ్ మ్యూటేషన్లకు వీలైనంత త్వరిగతిన ఆదేశాలు ఇవ్వాలని తహసీల్దార్లు కోరుతున్నారు. ఈ క్రమంలో ధరణిలో వీటిని అప్​లోడ్ చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ తాజాగా మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. పోర్టల్ ఎనేబుల్ కావడం లేదని, సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని రెవెన్యూ ఉద్యోగ సంఘం నాయకుడొకరు ‘దిశ’కు వివరించారు. పెండింగు మ్యూటేషన్లను పూర్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని, ఆప్షన్లపై దృష్టి పెట్టాలని కోరారు.

తప్పు జరిగేది అక్కడే

భూ రికార్డుల్లో తప్పులకు కేంద్రం కంప్యూటర్. తప్పు జరిగితే కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరే. ఎక్కడా కంప్యూటర్ ఆపరేటర్ పై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఓ రెవెన్యూ నిపుణుడు చెప్పారు. టెక్నికల్ నాలెడ్జ్ వినియోగంలో ఉద్దేశ్యపూర్వకంగా చేసిన తప్పులకు వేలాది మంది రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడీ ఆటోమెటిక్ మ్యూటేషన్ ప్రక్రియ ద్వారా తలెత్తే సమస్యలకు ఎవరిని కార్నర్ చేస్తారో వేచి చూడాలి. భౌతికంగా భూమి లేకపోయినా రికార్డుల్లో ఉన్నాయని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తలెత్తే వివాదాలు కూడా ఉన్నాయి. అందుకే తొలుత రికార్డులను 100 శాతం పర్ఫెక్ట్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. పోర్టల్ లోపాలను రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొత్త ఆర్వోఆర్ చట్టం-2020 అమలులోకి వచ్చినా నేటికీ మార్గదర్శకాలు రూపొందించకపోవడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.



Next Story

Most Viewed