టీ20 వరల్డ్‌ కప్‌లో కీలక ఘట్టం.. ఆ జట్టు మాత్రమే గెలవాలంటూ దండాలు

by  |
టీ20 వరల్డ్‌ కప్‌లో కీలక ఘట్టం.. ఆ జట్టు మాత్రమే గెలవాలంటూ దండాలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఫ్యాన్స్ ప్రతి మ్యాచ్‌లో ఆ దేశ జాతీయ జట్టు విజయం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ప్రార్థనలు చేస్తుంటారు. ఇక టీ20 వరల్డ్‌కప్‌లో అయితే ఈ డోస్ ఇంకొంచం ఎక్కువగా ఉంటుంది. నరాలు తెగే ఉత్కంఠతో మ్యాచులను ఆస్వాదిస్తుంటారు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో న్యూజీలాండ్-అఫ్గనిస్తాన్‌ మ్యాచ్‌పై భారత అభిమానుల దృష్టి మళ్లింది. ఈ మ్యాచ్‌లో న్యూజీలాండ్‌పై అఫ్గనిస్తాన్ విజయం సాధించాలంటూ నెటిజన్లు మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం అఫ్గన్‌ జట్టే టీమిండియాకు బాహుబలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ అభిమానులు కూడా అఫ్గనిస్తాన్‌ గెలవాలని కోరుకోవడం గమనార్హం. ఇంతకీ ఆంతర్యం ఏమిటంటే..!

టీమిండియా సెమీస్‌ కోసమే..!

అభిమానులు ప్లేట్ మార్చింది పక్క దేశం లాభం కోసం కాదు.. టీమిండియా సెమీస్ వెళ్లాలన్న ఆకాంక్షకోసమే. ఎందుకంటే, టీ20 వరల్డ్ కప్‌ సిరీస్‌లో భారత్‌ వరుసగా రెండు మ్యాచుల్లో ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. తొలుత ఆడిన మ్యాచుల్లో బలమైన ప్రత్యర్థులు(పాకిస్తాన్, న్యూజీలాండ్) కావడం, జట్టు లోపాల కారణంగా ఓటమి తప్పలేదు. కానీ, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో (అప్ఘనిస్తాన్, స్కాట్‌లాండ్)పై టీమిండియా తిరిగి పుంజుకుంది. భారీ విజయాలతో సెమీస్ ఆశలను అభిమానుల్లో రెట్టింపు చేసింది. గ్రూప్‌ 2లో ఇప్పటికే పాకిస్తాన్ సెమీస్ చేరింది. ఇక రెండో బెర్తు కోసం న్యూజీలాండ్, అఫ్గనిస్తాన్‌ మధ్య పోటీ ఉందనుకున్న సమయంలో టీమిండియా వరుస విజయాలతో నెట్‌రన్‌రేట్ ఆ రెండు జట్లను డామినేట్ చేశాయి.

https://twitter.com/msdian_abhi/status/1456841852682833922?s=20

ఇప్పటికే గ్రూప్‌ 2లో అన్ని జట్లు నాలుగేసి మ్యాచులు ఆడాయి. ఈ క్రమంలో ప్రధానంగా న్యూజీలాండ్ సెమీస్‌ రేసులో ముందు ఉంది. ఒక ఓటమి, మూడు మ్యాచుల్లో విజయాలతో 6 పాయింట్లు సాధించింది. అఫ్గనిస్తాన్ రెండు విజయాలు, రెండు పరాజయాలతో కొనసాగుతోంది. ఇక 5వ మ్యాచ్‌‌‌లో భారీ విజయం సాధిస్తే తప్పా.. అఫ్గన్ సెమీస్‌కు వెళ్లే దారే లేదు. కానీ, అత్యల్ప తేడాతో న్యూజీలాండ్‌పై గెలిస్తే టీమిండియాకు కలిసిరానుంది. ప్రస్తుతం టీమిండియా, అఫ్గనిస్తాన్‌లకు చెరి నాలుగు పాయింట్లు ఉన్నప్పటికీ.. నెట్‌రన్‌రేట్ విరాట్ సేనకే అధికంగా ఉంది.

దీంతో రేపు జరగబోయే మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ గెలిస్తే.. ఆ జట్టుతో పాటు న్యూజీలాండ్‌ కూడా సెమీస్‌కు దూరం అవుతోంది. ఈ క్రమంలో నమీబియాపై భారత్ విజయం సాధిస్తే సెమీస్‌ బెర్తు కన్ఫామ్ అవుతోందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా అఫ్గన్ గెలవాలని టీమిండియా అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఆటగాళ్లతో పాటు ఆ దేశ ప్రజలు.. సెమీస్‌లో పాకిస్తాన్‌తో భారత జట్టే తలపడాలని కోరుకోవడం గమనార్హం. ఏది ఏమైనా ఈ ఉత్కంఠకు తెరపడాలంటే రేపటి మ్యాచ్‌ ముగిసే వరకు వేచిచూడాల్సిందే.


Next Story