పీఆర్సీపై ఎన్నో డౌట్లు.. టీచర్ల చూపు వారివైపేనా..!

by  |
పీఆర్సీపై ఎన్నో డౌట్లు.. టీచర్ల చూపు వారివైపేనా..!
X

రాష్ట్రంలో ఉత్కంఠను నెలకొల్పుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు అన్ని రాజకీయ పార్టీలకు షాక్ ఇవ్వనున్నట్లు అర్థమవుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల హామీలనుపై నమ్మకం కోల్పోయిన ఉపాధ్యాయులు ఇండిపెండెంట్ అభ్యర్థుల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోని హమీలు అమలు చేయకపోవడం, ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రకటనలు చేయడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు పలువురు చెబుతున్నారు.

దిశ,తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి రికార్డ్ స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్‌కు 93, వరంగల్‌కు 71 నామినేషన్లు వచ్చాయి. ఈ భారీ నామినేషన్లు అన్ని రాజకీయ పార్టీలకు చెమటలు పట్టిస్తున్నాయి. పట్టభద్రులను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రభుత్వం వివిధ రకాల సంకేతాలు అందిస్తుండగా, ప్రతిపక్షపార్టీలు హామీల వర్షాలు కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీచర్లు ఎటువైపు ఉండనున్నారనే ఉత్కంఠ నెలకొంది.
పార్టీలపై నమ్మకం లేదు

అధికార, ప్రతిపక్ష పార్టీలపై టీచర్లు నమ్మకం కోల్పోయినట్టుగా తెలుస్తున్నది. గతంలో 7 శాతం పీఆర్సీని అందిస్తామని తెలిపిన సీఎం కేసిఆర్ ఎన్నికల నేపథ్యంలో 29శాతం పీర్సీని అందిస్తామని సంకేతాలివ్వడాన్ని టీచర్లు నమ్మడం లేదు. ఎన్నికల కమిషనర్‌తో అనుమతి తీసుకొని ప్రకటనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు టీచర్లను ఉద్యోగులు కాదనడం, స్థానిక సంస్థలకు అప్పగిస్తామని వ్యాఖ్యానించడంపై మనస్తాపం చెందినట్టుగా తెలుస్తున్నది. అలాగే ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు, నోషల్ సర్వీసు, హెల్త్ కార్డ్‌ల సమస్యలు పరిష్కరించకపోవడం, 010 విధానాన్ని రద్దు చేస్తామనండం, సీపీఎస్ విధానాన్ని తీసుకురావడంపై ఉపాధ్యాయులు గుర్రుగా ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇన్‌కమ్ టాక్సీ పరిమితిని రూ.2లక్షల 50వేలకు పైన పెంచకపోవడం, పెట్రోలు, డీజిల్ రేట్లను సామన్యులకు భారం పడేలా పెంచడం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై టీచర్లు మండిపోతున్నారు. వీటికి తోడు ఎన్నికల ప్రచారాల్లో మూడేళ్లు అధికారంలో తామే ఉంటామని, సమస్యల పరిష్కారం తమతోనే సాధ్యమవుతుందని అధికార పార్టీ హెచ్చరికలకు ఓటు రూపంలో తమ సమాధానాన్ని తెలియజేసేందుకు టీచర్లు సిద్ధమవుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు సరైన హామీలు ఇవ్వకపోవడం, టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామన్న హామీలకు క్షేత్ర స్థాయిలో ప్రచారం కల్పించకపోవడంతో అన్ని రాజకీయ పార్టీలపై టీచర్లు పూర్తిగా నమ్మకాన్ని కోల్పోతున్నారు.

అందుకే వాళ్ల వైపు..

ఆయా పార్టీలపై నమ్మకం కోల్పోయిన టీచర్లు సమస్యలపై పోరాడే శక్తి ఉన్న నాయకులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులను ఎన్నుకునేందుకు స్వతంత్ర అభ్యర్థులపై ఆసక్తి చూపుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వివిధ రకాల ఉపాధ్యసంఘాలు మద్దతును ప్రకటిస్తున్నప్పటికీ ఆ సంఘాల్లో సభ్యులుగా ఉన్న టీచర్లు బహిరంగంగా తమ అభిప్రాయాలను వెల్లడించడం లేదు. కేవలం ఆయా సంఘాల రాష్ట్ర నాయకులు మాత్రమే ప్రభుత్వం నుంచి హామీలు వచ్చినందున టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటిస్తున్నమని తెలుపుతున్నారు. సగటు ఉపాధ్యాయుడు మాత్రం ఎన్ని హామీలు ప్రకటించినా తమ అభిప్రాయాన్ని మార్చుకోమనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పోటీలో ఉన్న తమ సామాజిక వర్గాల వారికి, తమ సంఘానికి చెందిన నాయకులకు ఓట్లు వేసి ఆత్మగౌరవాన్ని చాటుకోవాలని టీచర్లు భావిస్తున్నారు.

Next Story

Most Viewed