కీచక టీచర్.. మద్యం మత్తులో 12 మంది చిన్నారులను అలా..!

by  |
కీచక టీచర్.. మద్యం మత్తులో 12 మంది చిన్నారులను అలా..!
X

దిశ, దుబ్బాక : మద్యం మత్తులో ఓ ఉపాధ్యాయుడు 12 మంది చిన్నారులను చితకబాదాడు. ఈ ఘటన సిద్ధిపేటలోని దుబ్బాక నియోజకవర్గం పద్మనాభంపల్లిలో శుక్రవారం సాయంత్రం వెలుగుచూసింది. గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రుల కథనం ప్రకారం.. పద్మనాభుని పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతి నుంచి ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థులు వేముల ప్రశాంత్, మనోజ్, వర్షిత్, సుశాంత్, హరీష్, ప్రసాద్, రాకేష్, పృత్విక్, హర్శిత్, లోకేష్, నిశ్విత, స్పందన, రవళి అనే పన్నెండు మంది విద్యార్థులను అమ్మన సంజీవరెడ్డి అనే ఉపాధ్యాయుడు మద్యం మత్తులో చితకబాదినట్లు తెలిపారు.

12 మంది విద్యార్థులను ఒకే విధంగా చెంపలపై గాయాలు వచ్చేటట్టు గిచ్చాడు. మద్యం మత్తులో తనకు తాను ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితిలో ఇలా చేశాడని ఆరోపించారు. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లిన విద్యార్థులను తల్లిదండ్రులు చూసి వెంటనే గ్రామ సర్పంచ్‌తో కలిసి పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను అన్యాయంగా మద్యం మత్తులో చితకబాదిన ఉపాధ్యాయుని పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పలుమార్లు హెచ్చరించినట్లు గ్రామ సర్పంచ్ పరుశరాములు తెలిపారు. ఇది కేవలం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలా జరిగిందని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ ప్రభుదాస్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే డీఈఓ దృష్టికి తీసుకెళ్లామని విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయునిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



Next Story