ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా?..ప్రభుత్వంపై బాబు ఆగ్రహం

by  |
ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా?..ప్రభుత్వంపై బాబు ఆగ్రహం
X

ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోందో తనకు అర్ధం కావడం లేదని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సస్పెన్షన్ల ట్రెండ్ నడుస్తున్నట్టు కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు. మాస్కులు అడిగినందుకు నిన్న ఓ డాక్టర్‌ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిని కూడా తొలగించారు. ప్రశ్నిస్తే వేటు వేస్తారా? అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

కరోనా మహమ్మారిపై ముందు నిలిచి పోరాడుతున్న వైద్యులు, ఇతర సిబ్బంది మాస్కులు, రక్షణ ఉపకరణాలు లేక నిస్సహాయుల్లా మిగిలిపోతున్నారన్న చంద్రబాబునాయుడు, తీవ్రమైన అంశంపై తక్షణం స్పందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎలాంటి రక్షణ లేకుండా కరోనా రోగులకు సేవలు అందిస్తూ తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్యసిబ్బంది పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మానవత్వం ప్రదర్శించాలని ఆయన సూచించారు.

కాగా, తమకు మాస్కులు లేవని, రక్షణ దుస్తులు కావాలని అడిగిన విశాఖ జిల్లా నర్సీపట్నం వైద్యుడు సుధాకర్‌ను సస్పెండ్ చేస్తూ డిస్ఠ్రిక్ట్ హెల్త్ సూపరిండెంట్ వేటు వేశారు. చిత్తూరు నగరిలో నాలుగు కరోనా కేసులున్నా, ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని, అకౌంట్లను సీజ్ చేశారంటూ మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ఓ వీడియోలో తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఏపీ సర్కారు ఆయనపై కఠిన ఆంక్షలు విధించింది. వెంకట్రామిరెడ్డిని నగరి విడిచి వెళ్లొద్దని హుకుం జారీ చేయడమే కాదు, ఆయన స్థానంలో శానిటరీ ఇన్ స్పెక్టర్ సీహెచ్ వెంకటేశ్వరరావును ఇన్ చార్జి మున్సిపల్ కమిషనర్ గా నియమించింది.

Tags:suspension, chittoor nagari, nagari municipal commissioner, venkatramireddy, doctor sudhakar, narsipatnam, tdp, chandrababu



Next Story