భారత్ బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు : అచ్చెన్నాయుడు

by  |
achem
X

దిశ, ఏపీ బ్యూరో: ఈ నెల 27న సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే తమ పార్టీకి ముఖ్యమని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ బంద్‌లో టీడీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు వ్యతిరేకిస్తున్న చట్టాలపై కేంద్రం పునరాలోచించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాల విషయంలో కేంద్రం పునరాలోచన చేయాలని టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఇప్పటికే స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయచట్టాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే 27న భారత్ బంద్ కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు తెలుగుదేశం పార్టీతోపాటు దేశవ్యాప్తంగా అనేక పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. మరోవైపు సీఎం వైఎస్ జగన్‌పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాష్ట్రంలోని సచివాలయాలను సందర్శిస్తానన్న జగన్‌కు దమ్ముంటే రైతులతో సమావేశం కావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో రైతులను జగన్ కూలీలుగా మార్చేశారంటూ అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

Next Story