జ్యువెలర్లపై పడ్డ ఐటీ నోటీసులు!

by  |
జ్యువెలర్లపై పడ్డ ఐటీ నోటీసులు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు కేంద్ర సర్కార్ ఎలాంటి నిర్ణయానికైనా సిద్ధమయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే, ఇటీవల ఐటీ శాఖ నుంచి జ్యువెలరీ వ్యాపారస్తులకు వెళ్లిన నోటీసులే దీనికి కారణం. 2016లో మోదీ నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత జ్యువెలర్లు ఎక్కువ మొత్తంలో బంగారాన్ని అమ్మారు. రద్దైన నోట్లను వదిలించుకునేందుకు అధికసంఖ్యలో వినియోగదారులు షోరూంలలో బంగారాన్ని కొనుగోలు చేశారని ఓ వ్యాపారి చెప్పారు. బంగారం కొనుగోలు ద్వారా పాతనోట్లను వదిలించుకున్నారని వ్యాపారని తెలిపారు. ఆ సమయంలో జరిగిన అమ్మకాలపై ఐటీ అధికారులు ఇప్పటికి కూడా నోటీసులు జారీ చేస్తున్నారని సదరు వ్యాపారి వెల్లడించారు.

నోట్ల రద్దు సమయంలో ఒక్క రాత్రిలోనే రెండు వారాల్లో జరిగే బంగారం అమ్మకాలు జరిగాయని మరో వ్యాపారి చెప్పారు. నోట్ల రద్దు సమయంలో ఎంత టర్నోవర్ జరిగిందనే వివరాలను చెప్పాలని ఐటీ శాఖ మూడు నెలల క్రితం నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. ఈ నోటీసులపై కోర్టుకు వెళ్లనున్నట్టు కొందరు వ్యాపారులు తెలిపారు. అయితే, కోర్టుకు వెళ్లిన తర్వాత కేసు ఓడిపోతే మిగిలిన మొత్తం చెల్లించాలని ఐటీ అధికారులు చెబుతున్నారని, అలా చేస్తే తమ వ్యాపారం మానుకోవాల్సి వస్తుందని ఓ వ్యాపారి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై, గతంలో మరణించిన వ్యక్తి శవాన్ని తీసి ఎలా మరణించాడో, చంపిన వ్యక్తిని ఎలా పట్టుకోవాలో అని పోలీసులు ఆరా తీసినట్టుగా ఈ వ్యవహారం కనిపిస్తోందని ఓ జ్యువెలరీ వ్యాపారి వ్యంగ్యంగా బదులిచ్చాడు.

ఇప్పటివరకూ దేశంలో 15,000 మంది జ్యువెలరీ వ్యాపారులకు ట్యాక్స్ డిమాండ్లను జారీ చేసినట్టు ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలరీ అసోషియేషన్ వారు చెబుతున్నారు. ఈ రంగంలో ఉన్న వ్యాపారుల నుంచి ఐటీ అధికారులు రూ. 50,000 కోట్లు వసూలు చేయడానికి సిద్ధమైన అసోషియేషన్ కార్యదర్శి సురేంద్ర వెల్లడించారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్లాలనుకునే వారు 20 శాతాన్ని డిపాజిట్‌గా ఉంచడం, కేసు ఓడిపోతే మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉండటంతో వ్యాపారుల్లో ఆందోళన ఎక్కువైందని అన్నారు. ఈ పరిణామాలు జెమ్స్ అండ్ జ్యువెలరీ వ్యాపార పరిశ్రమపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని, దీని వల్ల జ్యువెలరీ వ్యాపారులు అప్పులు చెల్లించడంలో విఫలమవుతారని జెమ్స్ అండ్ జ్యువెలరీ అసోషియేషన్ కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో వచ్చిన రాబడి గురించి పన్ను డిమాండ్ చేసే అధికారం ఐటీ అధికారులకు ఉన్నా సరే మొత్తం రాబడిని పన్ను రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేయడం ఆశ్చర్యంగా ఉందని బంగారం నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో జ్యువెలర్లకు ట్యాక్స్ నోటీసులు ఇచ్చారని, వీరి నుంచి సుమారు రూ. 2 ట్రిలియన్ల వరకూ వసూలు చేయాలనేది లక్ష్యమని ఐటీ అధికారుల నుంచి సమాచారం.


Next Story

Most Viewed