జేఎల్ఆర్‌లో ఉద్యోగుల తొలగింపు!

by  |
జేఎల్ఆర్‌లో ఉద్యోగుల తొలగింపు!
X

ముంబయి: గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాల అనంతరం టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) విభాగంలో ఉద్యోగాలను తొలగించాలని నిర్ణయం తీసుకున్నది. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడం, నష్టాలను అధిగమించేందుకు జేఎల్ఆర్ కార్ల ఉత్పత్తి ప్లాంట్లలో 1,100 మంది తాత్కాలిక ఉద్యోగులను జూలైలో తొలగిస్తామని ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఉద్యోగాల తొలగింపుతో టాటా మోటార్స్ లగ్జరీ విభాగంలోని జేఎల్ఆర్‌కు బిలియన్ పౌండ్లను పొదుపు చేయాలని భావిస్తున్నట్టు పేర్కొంది. టాటా మోటార్స్ సమీక్షలో భాగంగా 2021 మార్చి నాటికి దేశీయంగా 5 బిలియన్ పౌండ్లను ఆదా చేయాలని భావిస్తున్నామని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాలాజీ చెప్పారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు 3.5 బిలియన్ పౌండ్లను సాధించినట్టు స్పష్టం చేశారు. అంతేకాకుండా మూలధన వ్యయాన్ని 3.5 బిలియన్ పౌండ్ల నుంచి 2.5 బిలియన్ పౌండ్లకు తగ్గించనున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో జేఎల్ఆర్‌కు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న చైనా, యూరప్, అమెరికా దేశాల్లో ల్యాండ్ రోవర్ డిఫెండర్, రేంజ్ రోవర్ అమ్మకాలు పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయని బాలాజీ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల లగ్జరీ కార్ల విక్రయాలు 30శాతానికి పైగా తగ్గినట్టు సోమవారం కంపెనీ వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే, టాటా మోటార్స్ ఆదాయంలో కీలకంగా ఉన్న జేఎల్ఆర్ ఆదాయం మార్చితో ముగిసిన త్రైమాసికంలో 27.7శాతం తగ్గింది.

Next Story