ఎస్‌యూవీ విభాగంపై మరింత దృష్టి : టాటా మోటార్స్

by  |
ఎస్‌యూవీ విభాగంపై మరింత దృష్టి : టాటా మోటార్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాటా మోటార్స్ కంపెనీ దేశీయ మార్కెట్లో స్పొర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(SVU) విభాగంలో విస్తృత పోర్ట్ ‌ఫోలియోను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆదివారం వెల్లడించింది. ప్యాసింజర్ వాహన విభాగంలో ఈ వాహనాలకున్న మెరుగైన మార్కెట్ వాటాను దక్కించుకునేందుకు ఈ నిర్ణయం సహాయపడుతుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ యూనిట్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర చెప్పారు.

ప్రస్తుత ఎస్‌యూవీ విభాగంలో నెక్సాన్, హారియర్ లాంటి మోడళ్లను అందిస్తున్నప్పటికీ, వినియోగదారుల కొనుగోళ్లను పెంచేందుకు దీన్ని మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నట్టు ఆయన వివరించారు. అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా ఇటీవల ఎస్‌యూవీ సెగ్మెంట్ వాహనాలపై ఆదరణ పెరిగింది. 2015లో దేశీయ మార్కెట్లో ఎస్‌యూవీల వాటా 15 శాతం మాత్రమే ఉండేది.

ప్రస్తుత ఏడాది ఇది 30 శాతానికి పెరిగిందని శైలేష్ చంద్ర పేర్కొన్నారు. ఈ మార్పుల నేపథ్యంలో టాటా మోటార్స్ ఎస్‌యూవీ విభాగంలో మరింత వాటా కోసం ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు. తమ సంస్థ నుంచి హారియర్ మోడల్ కొత్త ఆటోమెటిక్ వెర్షన్ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. నెక్సాన్ కూడా అక్టోబర్‌లో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. భవిష్యత్తులో దీన్ని మరింత పెంచే చర్యలు తీసుకుంటామన్నారు.



Next Story