విజయ్ హజారే ఫైనల్‌లో తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్

by  |
విజయ్ హజారే ఫైనల్‌లో తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్
X

దిశ, స్పోర్ట్స్: ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్‌లోకి తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ జట్లు ప్రవేశించాయి. జైపూర్ సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ – సర్వీసెస్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన హిమాచల్ ప్రదేశ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. రిషి ధావన్ 84, చోప్రా 78 రాణించారు. ఆ తర్వాత 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్వీసెస్ జట్టు 46.1 ఓవర్లలో కేవలం 204కు ఆలౌట్ అయ్యింది. దీంతో హిమాచల్‌ప్రదేశ్ జట్టు 77 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి సారి విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ చేరింది.

ఇక అదే వేదికగా తమిళనాడు-సౌరాష్ట్ర మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా సాగింది. సౌరాష్ట్ర తొలుత బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. జాక్సన్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. జాక్సన్ 134 పరుగులు చేయగా.. వసవధ 57, జడేజా 52 పరుగులు సాధించారు. విజయ్ శంకర్‌కు 4 వికెట్ల లభించాయి. 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు జట్టు ఆఖరి బంతికి విజయం సాధించింది. బాబా అపరాజిత్ 122 పరుగులు చేయగా.. వాషింగ్టన్ సుందర్ 70 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. సౌరాష్ట్ర బౌలర్ చేతన్ సకారియా 5 వికెట్లు తీసినా జట్టును గెలిపించలేక పోయాడు. ఆఖరి ఓవర్లో 7 పరుగులు కావల్సి ఉండగా.. సాయి కిషోర్ చివరి బంతికి ఫోర్ కొట్టి తమిళనాడును గెలిపించాడు. ఈ నెల 26న తమిళనాడు-హిమాచల్ ప్రదేశ్ ఫైనల్‌లో తలపడతాయి.


Next Story

Most Viewed