సర్కారు బడికి ‘వన్నె’ తెచ్చిన టీచర్

by  |
సర్కారు బడికి ‘వన్నె’ తెచ్చిన టీచర్
X

దిశ, వెబ్‌డె‌స్క్ : భారత్‌లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెచ్చులూడిపోయిన భవనాలు, నీరు కారే పైకప్పులు, కూర్చోవడానికి సరైన వసతులు కూడా లేకుండా దీనావస్థలో దర్శనమిస్తుంటాయి. తమిళనాడులోని ఓ సర్కారీ పాఠశాల కూడా ఇలానే ఉండగా, విద్యార్థుల కోసం ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు తన జీతంతో బాగు చేయించి శభాష్ అనిపించుకుంది.

తమిళనాడు, కరుకకొల్లాయ్ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ భవనాన్ని 2005-06లో నిర్మించారు. డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్స్‌కు 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్కూల్ భవనం సీలింగ్ పెచ్చులూడిపోగా, ప్రతి ఏటా వర్షాకాలంలో పైకప్పు నుంచి నీళ్లు ధారగా కురుస్తుండేవి. దీంతో విద్యార్థులు చాలా ఇబ్బంది పడేవారు. 20 మంది విద్యార్థులు చదువుకునే ఆ పాఠశాలకు హోసూర్‌కు చెందిన ఎన్. పూన్కొడి ఒక్కరే ఉపాధ్యాయురాలు కాగా, ఆమె హెడ్‌ మిస్ట్రెస్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. కాగా విద్యార్థుల కష్టాన్ని చూసి చలించిపోయిన ఆ టీచర్.. భవన పైకప్పు రిపేర్ చేయించేందుకు ఫండ్స్ సమకూర్చాల్సిందిగా చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆర్ మురుగన్‌కు లేఖ రాయడంతో లక్ష రూపాయల నిధులు అలాట్ చేశారు. ఈ మేరకు భవనానికి మరమ్మతులు చేపట్టగా.. ఫ్లోర్స్, పైకప్పులతో పాటు పాఠశాలకు పెయింటింగ్‌కు కూడా వేయించారు. అయితే ఖర్చు లక్షా 37వేలు కాగా, అదనంగా అవసరమైన డబ్బులను పూన్కొడి తన జీతం నుంచి వెచ్చించడం విశేషం.

మేకోవర్ తర్వాత ఇప్పుడు పాఠశాల గోడలపైనున్న ఇంగ్లీష్, తమిళ వర్ణమాలతో పాటు గణిత టేబుల్స్‌ విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు ఆ భవనంపై చిత్రించిన ప్రముఖులు, ఆదర్శ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల పెయింటింగ్స్ పాఠశాలకు మరింత అందాన్ని తీసుకురావడమే కాకుండా విద్యార్థులకు వారి గురించే తెలుసుకునే అవకాశం కల్పించింది. ఇక విద్యార్థులకు చదువు చెప్పడం కోసం ప్రతిరోజు 55 కిలోమీటర్లు ప్రయాణించే పూన్కొడి.. తన సేవింగ్స్ కంటే పిల్లల భవిష్యత్తు, శ్రేయస్సే ముఖ్యమని చెబుతోంది.


Next Story

Most Viewed