ఆర్థికవ్యవస్థ వృద్ధికి కంపెనీలు మరింత రిస్క్ తీసుకోవాలి: నిర్మలా సీతారామన్!

by  |
ఆర్థికవ్యవస్థ వృద్ధికి కంపెనీలు మరింత రిస్క్ తీసుకోవాలి: నిర్మలా సీతారామన్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ కంపెనీలు సరైన క్రెడిట్ లభ్యతతో పాటు ఆర్థికవ్యవస్థ వృద్ధికి మరింత రిస్క్ తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బుధవారం జరిగిన పరిశ్రమల సంఘం సీఐఐ గ్లోబల్ ఎకనామిక్ పాలసీ సమ్మిట్-2021 కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి.. సంస్థలు తమ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని, దేశ ఆర్థిక వ్యవస్థకు ఏం కావాలో అర్థం చేసుకోవాలని కోరుతున్నట్టు చెప్పారు. దీని కోసం భారత కంపెనీలు ముందుకు రావాలని, విస్తరణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ‘కొవిడ్ మహమ్మారి కారణంగా సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ప్రజల మద్దతుతో మనం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థను చూడగలుగుతున్నాం.

ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలలో ఒకటిగా భారత్ నిలిచింది. విధానపరమైన అడ్డంకులను పరిష్కరిస్తాం’ అని నిర్మలా సీతారామన్ వివరించారు. పరిశ్రమల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆర్థికవ్యవస్థ మెరుగైన వృద్ధిని చూస్తున్న తరుణంలో అందుకు అదనపు ప్రోత్సాహాన్ని అందించేందుకు పరిశ్రమలు ముందుకు రావాలని భావిస్తున్నామన్నారు. కేంద్రం మౌలిక సదుపాయాల కోసం అదనపు వ్యయాన్ని పెంచింది. కంపెనీలు మరింత రిస్క్ తీసుకునేందుకు సిద్ధపడాలన్నారు. మారుతున్న కార్మిక స్వభావం, 4జీ విప్లవం, ఉత్పాదకత పెరుగుదలకు డేటా అత్యవసరం, సరఫరాను మరింత పటిష్ఠం చేయాలని నిర్మలా సీతారామన్ అన్నారు.

ఇదే కార్యక్రమంలో మాట్లాడిన దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంతాపాండే.. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ 2021-22 చివరి త్రైమాసికంలో ఐపీఓకు వస్తుందన్నారు. దీంతో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థలను ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రైవేటీకరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, ఎన్ఐఎన్ఎల్, బీఈఎంఎల్, పవన్‌హాన్స్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లాంటి ప్రభుత్వ సంస్థలను డిసెంబర్-జనవరి మధ్య ప్రైవేటీకరణకు ఫైనాన్స్ బిడ్లను ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed