అక్కడ భారీ స్ర్కీన్‌లు.. భారత్, పాక్‌ మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్

by  |
India-Pakistan match, Heavy betting
X

న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంచనాలు భారీగా ఉంటాయి. వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్‌లో ఈ రెండు జట్లు తలపడితే అభిమానులకు పండగే. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత తొలిసారిగా టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాక్ జట్లు సమరానికి సై అంటున్నాయి. నేడు దుబాయ్‌ వేదిక సూపర్-12 రౌండ్‌లో తలపడనున్నాయి. ఇదంతా ఒక వైపు అయితే, మరోవైపు ఈ మ్యాచ్‌పై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ప్రధాన నగరాల్లోని పబ్స్, రెస్టారెంట్లలో ఈ దందా ద్వారా భారీ మొత్తంలో నగదు చేతులు మారనుంది. యాప్స్ ద్వారా కూడా భారీగానే బెట్టింగ్ జరగనుంది. ఇండియా, పాక్ మ్యాచ్‌పై మొత్తంగా రూ. 1000 కోట్ల పైగా బెట్టింగ్ జరగనుందని ఓ నివేదిక తెలిపింది.

ఇప్పుడు యాప్స్‌దే హవా..

క్రికెట్ అంటేనే బెట్టింగ్‌.. బెట్టింగ్ అంటేనే క్రికెట్.. అనే రీతిలో క్రికెట్‌పై బెట్టింగ్ జరుగుతుంది. టీ20 ఫార్మాట్‌కు ఆదరణ పెరిగాక బెట్టింగ్ స్వరూపమే మారిపోయింది. ఐపీఎల్ వచ్చాక ఈ దందా ప్రతి సీజన్‌కు రూపాంతరం చెందుతూనే ఉంది. టీమ్ 11 నుంచి, టాస్, బాల్ టూ బాల్, సిక్స్, ఫోర్, వికెట్, మ్యాచ్ ఎవరు గెలుస్తారు?.. ఇలా ప్రతిదానిపై బెట్టింగ్ జరుగుతోంది. యువతనే టార్గెట్‌గా బూకీలు ఈ దందాను విస్తరిస్తున్నారు. అయితే, పోలీసులు బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నా.. ఈ దందా ఆగడం లేదు. ప్రతి ఏడాది కొత్త దారిలో ఈ దందా జరుగుతూనే ఉంది. బుకీలు ఇప్పుడు యాప్స్ ద్వారా బెట్టింగ్ నిర్వహించడంతో అడ్డులేకుండా పోయింది. టీ20 వరల్డ్ కప్‌ సూపర్-12లో భాగంగా జరిగే ఇండియా, పాక్ మధ్య మ్యాచ్‌పై యాప్స్ ద్వారానే పెద్ద మొత్తంలో బెట్టింగ్ జరగనుంది. దీని కోసం బుకీలు ప్రత్యేక ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు తెలుస్తుంది. పాక్‌పై రూ.వెయ్యికి రూ.1,600.. ఇండియాపై అయితే రూ.వెయ్యికి రూ.500 నుంచి 800 వరకు ఆన్‌లైన్ బెట్టింగ్ నడుస్తోంది.

పబ్స్, రెస్టారెంట్లలో స్పెషల్ స్క్రీన్‌లు

ప్రధాన నగరాల్లో, పట్టణాల్లోని పబ్స్, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లల్లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కోసం స్పెషల్‌గా స్క్రీన్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ అంచనాలకు మించే బెట్టింగ్ జరుగుతుంది. పెద్ద మొత్తంలో నగదు చేతులు మారనుంది. ఇండియా, పాక్ మ్యాచ్‌పై రూ. 1000 కోట్లకు పైగా బెట్టింగ్ జరుగుతుందని ఓ నివేదిక వెల్లడించింది. ఈ అంచనా రూ.1,500 నుంచి రూ. 2000 కోట్లు దాటొచ్చని అభిప్రాయపడింది. టాస్ గెలిచే జట్టు ఆధారంగా బెట్టింగ్ మారొచ్చని పేర్కొంది. 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై రూ. 2 వేల కోట్లు బెట్టింగ్ జరిగిందని తెలిపింది.


Next Story

Most Viewed