వేడెక్కిన లిక్కర్​ రాజకీయం.. వారిదే కీలక పాత్ర..!

by  |
వేడెక్కిన లిక్కర్​ రాజకీయం.. వారిదే కీలక పాత్ర..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మళ్లీ లిక్కర్​రాజకీయం వేడెక్కింది. కొత్త బార్ల ఏర్పాటుకు అధికార పార్టీ నేతలు సిండికేట్ అయ్యారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలే దీనిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఎవరూ టెండర్లు వేయకుండా చక్రం తిప్పుతున్నారు. ఒకవేళ కాదని టెండర్​వేస్తే… బార్లను నడుపలేరంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో కొత్త బార్లను వదిలేస్తే.. మిగిలిన లిక్కర్ వ్యాపారాల్లో తమ జోలికి రావద్దని, అంతా కలిసి చేసుకుంటామంటున్న వ్యాపరులు.. నాయకులతో కలిసి నిర్ణయం తీసుకుంటూ తీర్మానాలు చేసుకుంటున్నారు. ఇందులో కొందరు గులాబీ నేతలు మధ్యవర్తిత్వం చేస్తుండగా… మరికొందరు వాటాదారులుగా ఉండి బినామీలతో టెండర్లు వేశారు.

లిక్కర్‌ సిండికేట్‌ రాజకీయ రంగు పులుముకుంది. చాలా ప్రాంతాల్లో లిక్కర్​వ్యాపారం మొత్తం నేతల చేతుల్లో నుంచే సాగుతోందని మరోసారి వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా 72 మున్సిపాలిటీల్లో 159 బార్లకు నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే. వీటికి ఈ నెల 7 వరకు టెండర్లు స్వీకరించారు. 159 బార్లకు 7360 దరఖాస్తులు వచ్చాయి. వీటితో ప్రభుత్వానికి రూ.45 కోట్ల ఆదాయం వచ్చింది. కొన్ని బార్లకు వందల సంఖ్యలో దరఖాస్తులు రాగా, గులాబీ పార్టీకి చెందిన కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో కేవలం ఒకటీ, రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక్కడ అందరినీ సిండికేట్​చేయడంలో సదరు నేతలు రాజీకీయ చక్రం తిప్పినట్టు సమాచారం.

నిజామాబాద్‌లో ఎందుకిలా..?

జనవరి 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బార్లకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ముందు నుంచి కొన్ని బార్లకు కేవలం ఒక్కటే దరఖాస్తు రావడం చర్చనీయాంశమవుతోంది. ప్రధానంగా నిజామాబాద్​జిల్లాలోని 7 బార్లకు, బోధన్‌లోని 3 బార్లకు కేవలం ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చింది. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 7 బార్లు నోటిఫై కాగా దరఖాస్తు చివరి తేదీ వరకు వాటికి ఒక్కటే దరఖాస్తు రావడంతో ప్లాన్​మార్చారు. అదే టీంలోని కొంతమందితో మళ్లీ దరఖాస్తు వేయించారు. ఇలా మొత్తం 7 బార్లకు కేవలం 10 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. బోధన్​లోని 3 బార్లకు మూడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఆర్మూర్‌లోనూ ఒక్క బార్‌కు ముందుగా ఒక్కటే వచ్చినా… ఇక్కడ పైతం మళ్లీ సిండికేట్​చక్రం తిప్పారు. ఇలా చాలా చోట్ల బార్లకు మొదటి నుంచే సిండికేట్ అయ్యారు. కొన్నిచోట్ల బహిరంగ వేలం వేయగా, పలు ప్రాంతాల్లో సిండికేట్‌గా మారడంలో వ్యాపారుల మధ్య విభేదాలు రావడంతో అప్లికేషన్స్ పెరిగాయి. కానీ నిజామాబాద్, బోధన్‌లో మాత్రం గులాబీ నేతలు సక్సెస్​ అయ్యారని అబ్కారీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

159 బార్లకు 7360 దరఖాస్తులు

రాష్ట్రంలో కొత్తగా వచ్చిన 159 బార్లకు 7360 దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 55 బార్లకు 1053 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా వైరాలో రెండు బార్లకు 344 దరఖాస్తులు రాగా, యాదగిరిగుట్ట బార్‌కు 277 దరఖాస్తులు వచ్చాయి. నేరేడుచెర్లలో ఒక్క బార్‌కు 249 దరఖాస్తులు రాగా.. తొర్రూర్​లో ఒక్క బార్‌కు 248, ఇలా ఒక్కో బార్ ఉన్న ప్రాంతాల వారీగా పరిశీలిస్తే.. హాలియాలో 172, చేర్యాలలో 144, తుక్కుగూడలో 115, తిర్మలగిరిలో 190, చండూరులో 106, శంకరపల్లిలో 106, ఆదిభట్లలో 102, కరీంనగర్​ కొత్తపల్లిలో 122, మరిపెడలో 184, మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరులో 104, లక్సెట్టిపేట్‌లో 123, క్యాతంపల్లిలో 105, చెన్నూరులో 116, ఆలేరులో 126, వర్ధన్నపేట, మోత్కురులో 100 చొప్పున దరఖాస్తులు వచ్చాయి.

Next Story

Most Viewed