సెమీ కండక్టర్ల కొరత.. ప్రొడక్షన్ తగ్గింపు దిశగా మారుతి సుజుకీ

by  |
maruthi-suzuki
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో కీలకమైన సెమీ కండక్టర్ల కొరత ఆటో పరిశ్రమను కుదిపేస్తోంది. తాజాగా దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా వాహన తయారీలో వాడే సెమీ కండక్టర్ల కొరత కారణంగా ఆగష్టు నెలలో ఉత్పత్తిని తగ్గించనున్నట్టు బుధవారం ప్రకటించింది. కంపెనీ అనుబంధ సంస్థ సుజుకి మోటార్ గుజరాత్(ఎస్ఎంజీ) తయారీ ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలను తగ్గించనున్నట్టు స్పష్టం చేసింది.

మారుతీ సుజుకి ఇండియాకు ఎక్కువగా సరఫరా చేసే ఈ ప్లాంట్‌లోని కొన్ని తయారీ లైన్లలో ఒక షిఫ్ట్‌కు తగ్గించాలని కంపెనీ నిర్ణయించింది. సెమీ కండక్టర్ల కొరత కారణంగానే ఈ నెలలో పాక్షికంగా ఉత్పత్తి ప్రభావితమవుతున్నట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అంతేకాకుండా అదనంగా కొన్ని ఉత్పత్తి లైన్లలోనూ షిఫ్టులను తగ్గించనున్నట్టు కంపెనీ పేర్కొంది. అంతర్జాతీయంగా కొవిడ్ మహమ్మారి కారణంగా సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. కరోనా నేపథ్యంలో ప్రజలెక్కువగా ఇంటికే పరిమితం కావడం, ఇప్పటికీ చాలావరకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తుండటం.

టెలివిజన్, గేమింగ్స్ విభాగాలకు వినియోగదారులు అధికంగా ఖర్చు చేస్తుండటంతో డిమాండ్ పెరిగి వీటి సంబంధిత తయారీలో సెమీ కండక్టర్ల కొరత ఏర్పడింది. ఎలక్ట్రానిక్ పరికరాలు డేటాను ప్రాసెస్ చేసేందుకు అవసరమైన సెమీకండక్టర్లు తాత్కాలికంగా ఫ్యాక్టరీల మూసివేత వల్ల తక్కువగా తయారయ్యాయి. దీంతో కరోనా ప్రభావం నుంచి కంపెనీలు తిరిగి ప్రారంభమైన తర్వాత సరఫరా క్షీణించి ఆటంకాలను ఎదుర్కొన్నాయి. ఇటీవల స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు సైతం వీటి కొరత ప్రభావాన్ని ఎదుర్కొంటున్నట్టు వెల్లడించాయి.


Next Story

Most Viewed