పక్షుల అనారోగ్యంపై నిఘా వేయండి : పీసీసీఎఫ్

by  |
పక్షుల అనారోగ్యంపై నిఘా వేయండి : పీసీసీఎఫ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : పలు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉన్న బర్డ్ ఫ్లూ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర అటవీ-పర్యావరణ మంత్రిత్వశాఖ మార్గదర్శకాల మేరకు తెలంగాణ కూడా అప్రమత్తమైంది. జూపార్కులు లేదా ఇతర ప్రాంతాల్లో పక్షులు అనారోగ్యంతో చనిపోయినట్లయితే దానికి తగిన కారణాలను విశ్లేషించాలని, పోస్టుమార్టం ద్వారా నిర్ధారణకు రావాలని జిల్లా అటవీ అధికారులు, జూపార్కుల క్యురేటర్లకు రాష్ట్ర పీసీసీఎఫ్ ఆర్.శోభ స్పష్టం చేశారు. ఏవియన్ ఫ్లూ వైరస్ వ్యాప్తితో నాలుగైదు రాష్ట్రాల్లో వివిధ రకాల పక్షులు మృత్యువాత పడుతున్నాయని, ఈ సీజన్‌లో వచ్చే వలస పక్షులకు కూడా వైరస్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో అలర్టుగా ఉండాలని సూచించారు.

కేంద్ర వన్యప్రాణి విభాగం (వైల్డ్ లైఫ్) ఐజీ రోహిత్ తివారీ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర పీసీసీఎఫ్ అవసరమైతే చనిపోయిన లేదా అనారోగ్యంబారిన పడిన పక్షుల నుంచి తీసిన శాంపిళ్ళను భోపాల్ లోని యానిమల్ డిసీజెస్ ల్యాబ్‌కు పరీక్ష నిమిత్తం పంపించాలని సూచించారు. ఈ వైరస్ పెంపుడు జంతువులకు సైతం విస్తరించే అవకాశం ఉన్నందున వ్యాప్తి నివారణకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని సూచించారు. లక్షణాలు కనిపించిన వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. జూపార్కుల్లో, అటవీ ప్రాంతాల్లో అసహజ మరణాలు ఉంటే తగిన పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయాలని ఆదేశించారు.



Next Story

Most Viewed