బిల్లులు రావు.. అప్పులే మిగిలాయ్.. ఓ సర్పంచ్ ఆవేదన

by  |
బిల్లులు రావు.. అప్పులే మిగిలాయ్.. ఓ సర్పంచ్ ఆవేదన
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టే అభివృద్ది పనుల కోసం అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయానంటూ ఓ సర్పంచ్ విడుదల చేసిన ఆడియో కలకలం రేపుతోంది. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం సర్పంచ్ ఆడియో ప్రభుత్వం తీరును ఎత్తి చూపుతోంది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.15 లక్షలు అప్పు చేశానని, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో ఫోన్ ఆఫ్ చేసి బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

బతుకుడా సచ్చుడా అర్థం కాకుండా పోయిందంటూ సర్పంచ్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. నిర్మాణాలు పూర్తయిన తరువాత ఫీల్డ్ ఇన్స్‌స్పెక్షన్‌కు వచ్చే అధికారులు ఫోటోలు దిగి పోతున్నారే తప్ప బిల్లులు మాత్రం మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. గ్రామ పంచాయతీ పరిధిల్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో వాటిని పూర్తి చేసేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని బాధిత సర్పంచ్ వాపోయాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నాడు.

Next Story

Most Viewed