ఆక్సిజన్ సరఫరాను ఆపవద్దు.. కేంద్ర హోం శాఖ ఆదేశాలు

by  |
Covid Oxygen
X

న్యూఢిల్లీ : ఆక్సిజన్ కొరత కారణంగా కొన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు ట్యాంకర్లను వెళ్లకుండా అడ్డుకుంటున్నట్టు వార్తలు వస్తున్న తరుణంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ చట్టం కింద గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏ రాష్ట్రమూ ఆక్సిజన్ సరఫరాను మరో రాష్ట్రానికి చేరకుండా నిలిపేయడానికి వీల్లేదని, రాష్ట్రాల మధ్య ఆక్సిజన్ సరఫరాపై ఆంక్షలు విధించవద్దని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆదేశించారు. అందుకు అనుగుణంగా ట్రాన్స్‌పోర్ట్ అధికారులను ఆదేశించాలని పేర్కొన్నారు.

నిరాటంకంగా ట్యాంకర్లు ప్రయాణించడానికి సహకరించాలని వివరించారు. ఆక్సిజన్ ప్లాంట్‌లు ఉన్న రాష్ట్రాలు ప్రాణవాయువును తమ రాష్ట్రాల్లోని హాస్పిటళ్లకు పంపడానికి పరిమితం కావాలని ఉత్పత్తిదారులపై ఆంక్షలు విధించవద్దని ఆదేశించారు. అలాగే, ఎలాంటి ఆంక్షలు లేకుండా నగరాలు, జిల్లాలకు ట్యాంకర్లు వెళ్లడానికి అనుమతించాలని పేర్కొన్నారు. నిర్దేశిత జిల్లాలకే ఆక్సిజన్ వెళ్లాల్సి ఉందని, సదరు ట్యాంకర్ లేదా వాహనంతో ప్రత్యేకంగా అధికారులను జోడించవద్దని వివరించారు. సాధికారిక బృందం(2) ఎప్పటికప్పుడు సవరించే ఆక్సిజన్ సరఫరా ప్రణాళికకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత అధికారులందరూ తప్పకుండా లోబడి నడుచుకోవాలని ఆదేశించారు.

ఈ ఆదేశాల అమలుకు జిల్లా కలెక్టర్లు, సీనియర్ ఎస్పీలు, ఎస్పీలు బాధ్యత వహించాలని తెలిపారు. ఇలాంటి ఆదేశాలను కేంద్ర హోం శాఖ 18వ తేదీన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఓ లేఖ రాసి తెలియజేసింది. అవి కేవలం మార్గదర్శకాల రూపంలో ఉంటాయని, తాజా ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాల్సినవని హోంశాఖ వర్గాలు వివరించాయి. తాజాగా, విపత్తు నిర్వహణ చట్టం కింద ఆదేశాలను జారీ చేయడంతో వీటిని తిరస్కరించిన అధికారులు శిక్షార్హులు అవుతారని పేర్కొన్నాయి.

Next Story

Most Viewed